భువనగిరి అర్బన్, జూలై 8: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించే నాయకుడు ఎవరూ లేరని ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గెలిపించడం పీసీసీ నాయకుడి వల్ల, ఇతర ఏ నాయకుడి వల్ల కూడా కాదని చెప్పారు. కాంగ్రెస్లో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదని తెలిపారు. గురువారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా భువనగిరిలోని కిసాన్నగర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించే నాయకుడే లేడని, ఒకవేళ ఉంటే జీహెచ్ఎంసీలో ఓటమి ఉండేది కాదని అన్నారు. గాంధీభవన్లో స్పీచ్లు ఇచ్చే నాయకులు, కమిటీలో పేరు వచ్చిన నాయకులు.. తమ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని గెలిపించుకురావాలని సూచించారు. తన అనుమతి లేకుండా భువనగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ టికెట్ ఇవ్వొదని కోరారు. లీడర్లు అందరు గాంధీభవన్లో ఖాళీగా కూర్చొని ప్రెస్మీట్లకు పరిమితం కావద్దని హితవుపలికారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఇప్పటివరకు ఆస్తులు పోగొట్టుకుని అష్టకష్టాల్లో ఉన్నారని చెప్పారు. జిందాబాద్లు కొట్టించుకోవడం, ఉనికి చాటుకోవడానికి ప్రచారాలు చేసుకోవడం మానుకోవాలని సూచించారు.