హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు. మునుగోడులో బీజేపీ మూకలు భయానక పరిస్థితిని సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, వీ గంగాధర్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి బడుగుల మీడియాతో మాట్లాడారు. బీజేపీ అరాచకాలపై ఈసీకి అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వృద్ధులు, చదువురాని వారి చేతులపై పువ్వు గుర్తును అచ్చు వేస్తున్నారని, పువ్వు గుర్తు అచ్చు వేయడంపైనా ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చెందిన కంపెనీ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్స్ సీజ్ చేసి, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. తాను ఓడిపోతున్నానని గ్రహించిన రాజగోపాల్రెడ్డి.. ప్రజలను తన్నండి, తరమండి అని తన అనుచరులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
‘బండి’ని చూసి నవ్వుతున్నారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార శైలిని చూసి మునుగోడు ప్రజలు నవ్వుకుంటున్నారని బడుగుల అన్నారు. అమిత్షా చెప్పులు మోసిన చేతులతో బండి.. యాదాద్రీశుడిని తాకాడని మండిపడ్డారు. పోలీసులకు అడ్డంగా దొరికిన వారి కోసం సంజయ్ మత రాజకీయాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్లో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వలేదని.. మునుగోడు వాసులు కూడా రాజగోపాల్రెడ్డి లాంటి దొంగలకు చోటివ్వరని చెప్పారు. ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమచేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ.. ప్రభంజనంలాగా టీఆర్ఎస్ గెలవబోతున్నదని జోష్యం చెప్పారు.