నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై బీజేపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం ఈ అంశంపై తన నైజాన్ని బయటపెట్టుకొన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటి? అంటూ మునుగోడు ఉప ఎన్నికకు ముందే ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చారు. ‘బీజేపీ వాళ్లు మోటర్లకు మీటర్లు పెడతారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అలా ఏ రాష్ట్రంలో అయినా మీటర్లు పెట్టరా? అయినా నష్టాల్లో ఉన్న డిస్కంలను కాపాడు కొనేందుకు మీటర్లు పెడితే తప్పేంటి.
మా పార్టీ మీటర్లు పెట్టినా వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగానే కరెంటును ఇస్తుంది కదా?’ అంటూ అతితెలివిని ప్రదర్శించారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా తన నూతన క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంటుకు తాను వ్యతిరేకం కాదంటూనే ఆయన మరో వ్యాఖ్య చేశారు. ఎవరు ఎంత కరెంట్ కాల్చుతున్నరో, ఏ రైతుకు ఎంత సబ్సిడీ వస్తున్నదో తెలుసుకొనేందుకే కేంద్రం మీటర్లు పెడుతామని చెప్పి ఉండవచ్చంటూ తన అజ్ఞానాన్ని చాటుకొన్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టినట్టు ఆధారాలతో సహా వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్రెడ్డిపై తెలంగాణ రైతులంతా మండిపడుతున్నారు.