Minister Komatireddy | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం హెరిటేజ్ భవనంగా ఉన్న పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరించి, అందులో శాసనమండలి కార్యకలాపాలను నిర్వహిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం మండలి కొనసాగుతున్న భవనాన్ని సెంట్రల్హాల్గా వినియోగిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. వీటిలో ఐదింటికి కేంద్రం అనుమతులు పొందాల్సి ఉన్నది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న సీఎల్పీ, ఇతర ఫ్లోర్లీడర్ల కార్యాలయాలను కూల్చివేస్తామని, వాటిని ప్రాంగణం మధ్యలో కాకుండా ఒక చివరన నిర్మిస్తామని తెలిపారు.
కొత్త భవనాల నిర్మాణం జరిగేవరకు వాటిని అసెంబ్లీ భవనం పైఅంతస్థులో సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు. నాంపల్లిలోని పబ్లిక్గార్డెన్ నుంచి లలిత కళాతోరణం వరకు సుందరీకరించి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫెన్సింగ్ కారణంగా మూసుకుపోయిన అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహాన్ని అందరికీ కనిపించే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు నెలలోగా పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. తన నియోజకవర్గం పరిధిలోని పలు రోడ్లను రూ.100 కోట్లతో నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ
రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ రహదారుల హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ రింగ్రోడ్డు సౌత్ను జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. విజయవాడ-హైదరాబాద్ రహదారిని ఆరు లేన్లకు, హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించడంతోపాటు సెంట్రల్ రోడ్డు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) ద్వారా రాష్ర్టానికి రావాల్సిన నిధులను పెంచాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. హైదరాబాద్-విజయవాడ రహదారి మల్కాపూర్ వరకు కొంత పని పూర్తయిందని, మిగిలిన పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, హైదరాబాద్ నుంచి రెండున్నర గంటల్లోనే విజయవాడ చేరుకునే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
పార్లమెంటు సభ్యత్యానికి రాజీనామా చేస్తా
మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున పార్లమెంటు సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రెడ్డికి ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జయవీర్, బాలూనాయక్, కుంభం అనిల్కుమార్రెడ్డి, రోడ్లుభవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.