చౌటుప్పల్, ఆగస్టు 28: తాను బీజేపీలో చేరిన తరువాత చాలామంది ఆ పార్టీలో చేరుతున్నారనే కలరింగ్ ఇచ్చేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నానా విన్యాసాలు చేస్తున్నారు. తాను ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడంతో, పలువురు పార్టీలో చేరుతున్నారనే భ్రమలు కల్పించేందుకు విచిత్ర వ్యూహం రచించారు. అప్పటికే బీజేపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నవారికే తిరిగి పార్టీ కండువాలు కప్పి వారంతా కొత్తగా చేరినట్టుగా ప్రచారం చేసుకొంటున్నారు. చివరకు తాను పార్టీలో చేరుతున్న సందర్భంగా తనకే స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టినవారికి సైతం బీజేపీ కండువాలు కప్పుతుండటం గమనార్హం. ఇందుకు ఉదాహరణ పోలోజ్ అనిల్కుమార్ ఉదంతం. రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఆగస్టు 21న ఆయనకు స్వాగతం పలుకుతూ పోలోజ్ అనిల్కుమార్ పోస్టర్లు వేశారు.
అదే అనిల్కుమార్కు ఈ నెల 25న చౌటుప్పల్ పట్టణంలోని జీఎన్ రెడ్డి గార్డెన్స్లో బీజేపీ కండువా కప్పారు. మునుగోడు సభకు బస్సులు, కార్లు పెట్టి జన సమీకరణ చేసిన వారికి కూడా కొత్తగా బీజేపీ కండువాలు కప్పుతుండటంపై స్థానికులు జోక్లేసుకొంటున్నారు. గత ఎన్నికల్లో తనకు ఆర్థిక సహాయం చేసి, ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టినవారికి తాను తిరిగి ఆ డబ్బులు ఇవ్వాలంటే బీజేపీలో చేరాలని పలువురిపై రాజగోపాల్రెడ్డి ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
కొందరు డబ్బుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ కండువా కప్పుకొంటుండగా, మరికొందరు ఈ షరతును తిరస్కరిస్తున్నట్టు తెలిసింది. ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు రూ.లక్ష నుంచి రూ.20 లక్షల దాకా ముట్టజెప్పి బీజేపీలో చేర్చుకొంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే, వారితోపాటు క్యాడర్ బీజేపీలోకి చేరేందుకు విముఖత వ్యక్తం చేయడంతో ఆయా నాయకులు బీజేపీలో ఎందుకు చేరామా? అని ఇప్పుడు మధనపడుతున్నట్టు తెలిసింది. తన వెంట తిరిగే వారికి రోజుకు రూ. 1,500 నుంచి రూ. 2,000 నగదుతోపాటు బీరు, బిర్యానీ ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. అయితే, రాజగోపాల్రెడ్డి అనుచరవర్గం చేస్తున్న హడావిడిని ఎప్పటినుంచో బీజేపీలో ఉన్న నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజగోపాల్రెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.