హైదరాబాద్: జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం పోరాడి అమరుడైన కుమ్రం భీం జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకమైనదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోరాట యోధుని వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. కుమ్రం భీమ్ జీవితమంతా పొరాటాలతోనే గడిచిందని చెప్పారు. తన ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, బానిసత్వపు సంకెళ్లు తెంచడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని, పోరాటయోధుడని కొనియాడారు.
కుమ్రం భీమ్ ఆశయాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని చెప్పారు. ‘మా ఊళ్లో మా రాజ్యం’ అన్న కుమ్రం భీం నినాదాన్ని తెలంగాణ సర్కార్ నిజం చేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న సుదీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చామని వెల్లడించారు.
పోరుగడ్డ జోడే ఘాట్లో రూ.25 కోట్లతో కుమ్రం భీమ్ స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిద్వారా ఆయన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేస్తామని చెప్పారు.
జోడేఘాట్లో కుమ్రం భీమ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
కుమ్రం భీమ్ అడవిబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక అని, ఆయన 81వ వర్ధంతి సందర్భంగా గిరిజనులు ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకోవాలని సూచించారు.