రామచంద్రాపురం, జూలై 10: సంగారెడ్డి జిల్లా కొల్లూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఎంతో బాగున్నదని ప్రధానమంత్రి కార్యాలయ అధికారి మన్మిత్కౌర్ ప్రశంసించారు. గురువారం ఆమె సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణణ్తో కలిసి కొల్లూర్ 2బీహెచ్కే ఇండ్ల సముదాయాన్ని సందర్శించారు. ప్రాంగణం మొత్తం కలియదిరిగి నిర్మాణాలను పరిశీలించారు. 2బీహెచ్కే ప్రాజెక్టు నమూనాను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయని, లబ్ధిదారులు ఇండ్లల్లో నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. పేదల కోసం ఒకేచోట ఇంత పెద్ద స్థాయిలో 2బీహెచ్కే ప్రాజెక్ట్ నిర్మించడం అద్భుతమని మన్మిత్కౌర్ ప్రత్యేకంగా అభినందించారు.
నిర్మాణ రంగంలో ప్రైవేట్ ప్రాజెక్ట్లకు దీటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2బీహెచ్కే ప్రాజెక్ట్ నిర్మించి లబ్ధిదారులకు ఉచితంగా అందజేయడాన్ని ప్రశంసించారు. అనంతరం ఇండ్లలోకి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిందని, తన భార్య పేరుపైన ఇల్లు వచ్చిందని ఓ లబ్ధిదారు తెలిపారు. పేదలు సొంతింట్లో ఆత్మగౌరవంతో బతకడం చూసి మన్మిత్కౌర్ సంతోషం వ్యక్తంచేశారు. అనంతరం 2బీహెచ్కే ప్రాంగణంలో కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి మొక్కలు నాటారు.
ఆ తర్వాత లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. త్వరలోనే 2బీహెచ్కే ప్రాంగణంలో బీఎస్ఎన్ఎల్ టవర్, బ్యాంక్ సౌకర్యం, పోస్టాఫీస్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల తదితర వసతులను కల్పిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం తెల్లాపూర్లోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ను అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా పీఎం కార్యాలయ అధికారి మన్మిత్కౌర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా పేదలకు సొంతింటి కలను సాకారం చేయడం కోసం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 2బీహెచ్కే ప్రాజెక్ట్ను పరిశీలించేందుకు వచ్చినట్టు తెలిపారు. కొల్లూర్లో పేదల కోసం అద్భుతమైన 2బీహెచ్కే ప్రాజెక్ట్ నిర్మించారని, ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఆమె వెంట గృహనిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ చైతన్యకుమార్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, వైద్యాధికారి గాయత్రీదేవి, ఆర్డీవో రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్రెడ్డి ఉన్నారు.