కొల్లాపూర్, నవంబర్ 3: కాంగ్రెస్ నాయకుడు, మోసకారి జూపల్లి మాటలను ఎవరూ నమ్మొద్దని, ఆయనను నమ్మి పార్టీ మారి మోసపోయానని కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం, పార్టీ రాష్ట్ర నేత రంగినేని అభిలాష్రావు సమక్షంలో కిషన్నాయక్ తిరిగి గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాయక్ మాట్లాడుతూ.. మోసగాడు జూపల్లి మాటలు నమ్మి పార్టీ మారి తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించి పశ్చాతాపంతో తిరిగి సొంత పార్టీలో చేరినట్టు చెప్పారు. జూపల్లి నిజస్వరూపం తెలుసుకొని మిగితా వారు కూడా గులాబీ పార్టీలోకి రావాలని ఆయన సూచించారు. బీరం తనను సొంత అన్నలాగా ఆదరించారని తెలిపారు. అనంతరం బీరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో కొల్లాపూర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.