వేములవాడ దవాఖాన ఘనత
పక్షం రోజుల్లో రెండో ఆపరేషన్
వేములవాడ, మే 28: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానలో శనివారం ఓ వ్యక్తికి మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. పక్షం రోజుల్లోనే ఈ దవాఖానలో ఇది రెండో ఆపరేషన్ కావడం విశేషం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన 53 ఏండ్ల వయస్సుగల నల్ల ఆదిరెడ్డి మోకాలి నొప్పులతో బాధపడుతూ వారం క్రితం వేములవాడ వైద్యశాలకు వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ తప్పనిసరి అని సూచించారు. ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు సైతం అంగీకరించడంతో డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ శశికాంత్తో కూడిన వైద్యబృందం శనివారం మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది.
ప్రైవేట్ దవాఖానలో రూ.1.50 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సను ఉచితంగా చేసినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు తెలిపారు. కాగా ఈ నెల 16న కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన 69 ఏండ్ల వృద్ధుడు భూంరెడ్డికి కూడా ఇలాంటి ఆపరేషన్ చేశామని ఆయన పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే రమేశ్బాబు సహకారంతో రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నామని తెలిపారు.