కేసీఆర్ చూపించిన వీడియోల్లో బీజేపీ ప్రస్తావన ఎక్కడున్నది? స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా? కేసీఆర్ సర్కారు అంత బలహీనంగా ఉన్నదా? బయటి వ్యక్తులతో బేరసారాలు జరిపే ఖర్మ మాకు లేదు. ఈ వీడియోలపై ప్రత్యేక విచారణ నిర్వహించాలని మొదటినుంచీ కోరుతున్నాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
– కేంద్రమంత్రి కిషన్రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలున్నాయనటం అబద్ధం. మేము ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా కొనటానికి ప్రయత్నం చేయలేదు. సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్కు ఎందుకు విశ్వాసం లేదు? – తరుణ్చుగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి
బీజేపీలో ఎవరు చేరినా రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరుతాం. బీజేపీ సింబల్పై పోటీ చేయిస్తాం. ఆ నలుగురిని తీసుకొంటే ప్రభుత్వం కూలుతుందా? ఈ వ్యవహారంపై సీబీఐతో, సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని అడుగుతున్నది మేమే.
– బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా? అన్నట్టు.. చచ్చిన చీమ రెక్కలొచ్చి కొట్టుకొన్నట్టు ఉన్నది బీజేపీ తీరు. వందల కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయినా పూటకోతీరుగా నిస్సిగ్గుగా బొంకుతున్నది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ అధిష్ఠానమే తమను పంపిందని, సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నామని దళారులు స్పష్టంగా చెప్పినా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోల్లో బీజేపీ ప్రస్తావనే లేదని కిషన్రెడ్డి అంటే, ఆ వీడియోలు ముఖ్యమంత్రే ఆర్టిస్టులతో చేయించారని బండి సంజయ్ శుక్రవారం మీడియా సమావేశాల్లో అవాకులు చవాకులు పేలారు. వీరి ప్రకటనలు చూసిన తర్వాత ఇంతకన్నా నీచం ఇంకేమన్నా ఉంటుందా? అని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కన్నతల్లికి కూడా అన్యాయం చేసే దుర్మార్గానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అమిత్షా, బీఎల్ సంతోష్ ఎవరు?
కమల్ ఫైల్స్ వీడియోల్లో దొరికిపోయిన బ్రోకర్లు అమిత్ షా, బీఎల్ సంతోష్ కనుసన్నల్లోనే తాము పనిచేస్తున్నామని స్వయంగా చెప్పారు. ఆ వీడియోలను దేశమంతా చూసింది. అయినా, అందులో బీజేపీ ప్రస్తావన లేదు కదా! అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అంటున్నారు. ఇంత అజ్ఞానంగా మాట్లాడే నువ్వు కేంద్ర మంత్రి ఎలా అయ్యావని తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు. బీఎల్ సంతోష్, అమిత్ షా ఏ పార్టీవారో తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘కమల్ఫైల్స్ అంతా డ్రామా అని, ఆర్టిస్టులను పెట్టి చేసిండ్రని కిషన్రెడ్డి ఎట్ల అంటరు? కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస పరిజ్ఞానం ఉండొద్దా?’ అని మండిపడుతున్నారు. బ్రోకర్లలో ఒకరైన రామచంద్ర భారతి అనే వ్యక్తి గతంలో తాను చేసిన ఆపరేషన్లు ఎట్ల చేసిండో పూసగుచ్చినట్టు చెప్పారు. ఆయన ఎక్కడెక్కడ పర్యటించారో.. ఎవరెవరితో మాట్లాడారో.. ఏ విమానంలో వెళ్లారో.. ఏ రిసార్టులో ఉన్నారో కూడా చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బెంగళూరు టు చెన్నై, చెన్నై టు ముంబై 16 మంది ఎమ్మెల్యేలను తరలించామని చెప్పారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలను మారువేషాల్లో తీసుకెళ్లి ఓల్వో బస్సు ఎక్కించామనీ బయటపెట్టారు. ఆయన నాడు పర్యటించిన విమాన టికెట్లు, వోల్వో బస్సు నంబర్లు అబద్ధమా? అని నిలదీస్తున్నారు. కిషన్రెడ్డి దీనిని కూడా అబద్ధమని నోరుగాయితో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏయే రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టారో కూడా అదే వీడియోలో దళారులు పూజగుచ్చినట్టు చెప్పారు. వారు చెప్పినట్టుగానే దాదాపు 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలు కూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తీరును ప్రపంచమంతా చూసింది. ఇన్ని వాస్తవాలు కండ్లముందు కనిపిస్తుంటే అబద్ధమని ఎలా అంటారని నిలదీస్తున్నారు.
లైవ్లోనే ఫోన్లు
కేసీఆర్ విడుదల చేసిన వీడియోల్లో బ్రోకర్లు అప్పటికప్పుడు తుషార్ అనే వ్యక్తికి ఫోన్ చేశారు. అతడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారు. అతడు అమిత్షా సన్నిహితుడు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కేరళలో పోటీ చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అమిత్ షా స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. దళారులు ఆయనతో మాట్లాడిన కాల్ రికార్డు అంతా ఉన్నది. ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే ఇదంతా అబద్ధమని ఎట్ల చెప్తారు? తుషార్కు తమకు సంబంధం లేదని, ఆయన బీజేపీ మనిషి కాదని బండి సంజయ్ అంటున్నారు. ఆ వీడియోలో ‘తుషార్తోనే ఇప్పటివరకు మాట్లాడాను. ఆయన సంతోష్తో మాట్లాడుతున్నారు. అమిత్షాతో కూడా మాట్లాడటానికి సంతోష్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఫోన్ బిజీ వస్తున్నది’ అని రామచంద్ర భారతి అనే వ్యక్తి స్పష్టంగా చెప్పారు. మరి వీళ్లంతా ఎవరో, దేనిగురించి మాట్లాడారో బండి సంజయ్ చెప్పాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధం లేకుంటే ఫిర్యాదులెందుకు?
కమల్ఫైల్స్ బయటకు రావటంతో బెంబేలెత్తిపోయిన బీజేపీ నేతలు, ఆ మరుసటి రోజు నుంచే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రారంభించారు. ఈ అంశంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి ఆగమేఘాలమీద హైకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావు డిమాండ్ చేశారు. తాజాగా శుక్రవారం కిషన్రెడ్డి, బండి సంజయ్ కూడా అదే డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీజేపీ నేతలు శుక్రవారం సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. బీజేపీకి ఏ సంబంధం లేకుంటే తమకు సంబంధంలేదని ఓ ప్రకటన చేసి వదిలేయకుండా ఇంత హంగామా ఎందుకు చేస్తున్నట్టు? కోర్టులో పిటిషన్లు ఎందుకు వేస్తున్నట్టు? ఒకవైపు సంబంధం లేదు అంటూనే.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మీరు కొనలేదా? అంటున్న బండి సంజయ్ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఇంటి దొంగల భరతం పట్టాల్సిందే
పుణ్యంకోసం పోతే పాపం ఎదురైనట్టు ఆంధ్రతో కలిసినందుకు తెలంగాణ సమాజం 60 ఏండ్లు గోస పడ్డది. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడితేగాని మళ్లీ స్వేచ్ఛ లభించలేదు. స్వయంపాలనలో తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే అన్నిరంగాల్లో వికసిస్తున్నది. ఇంతటి కీలక సమయంలో దుర్మార్గ, స్వార్థ రాజకీయం కోసం రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలే తెలంగాణను బలిపెట్టేందుకు సిద్ధపడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టిస్తే ఎవరి నష్టం? ఎవరికి లాభం? కన్నతల్లికే అన్యాయం చేయాలని చూస్తున్న బీజేపీ ఇంటిదొంగల భరతం పట్టాల్సిందేనని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నది. పోగాలం వచ్చింది కాబట్టే బీజేపీ నేతలు నడమంత్రపు చేష్టలకు దిగుతున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ఇంటి దొంగల బండారం మొత్తం బయటపెట్టాల్సిందేనని, ఎవ్వరినీ వదిలొద్దని తెలంగాణ యువతతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న మేధావి వర్గం సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నది.
రెండేండ్ల క్రితం హైదరాబాద్లో సింహయాజీ ఆధ్వర్యంలో జరిగిన వాజపేయ సోమయాగంలో రామచంద్ర భారతి, బీఎల్ సంతోష్
అప్పుడు షిండేలను సృష్టిస్తామని ఇప్పుడు సంబంధం లేదంటారేం!
టీఆర్ఎస్లో చాలామంది షిండేలున్నారు. మహారాష్ట్రలో జరిగినట్లుగా ఇక్కడ కూడా జరుగుతుంది.
– 2022 జూలై 11న బండి సంజయ్
మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలోనూ రాజకీయం మారబోతున్నది. ఇక్కడ కూడా అనేక మంది షిండేలున్నారు.
– 2022 జూలై 1న లక్ష్మణ్
రెండు మూడు రోజుల్లో ఏక్నాథ్ షిండేల పేర్లు బయటపెడుతాం. వాళ్ల ఫోన్ల నుంచి మాట్లాడటం లేదు. వేరే నంబర్ల నుంచి మాట్లాడుతున్నారు.
– అక్టోబర్ 22 న రఘునందన్రావు