హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)ః నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిన వ్యవహారంపై కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై రోజుకో తీరుగా జవాబిస్తున్నారు. ఒకపూట తాను చెప్పిన దానికే మరోపూట విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఒకసారేమో తమ పార్టీతో వాళ్లకేమి సంబంధం? అంటారు. మరుసటి రోజేమో మాట్లాడితే తప్పేమిటి? అంటారు. ఒకసారి నందు ఎవరో తనకు తెలియదంటారు. అంతలోనే నందుది మా అంబర్పేటే అంటారు. గత మూడు రోజుల్లో ఒక్కో అంశంపై కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు..
అక్టోబర్ 26 రాత్రి: వాళ్లెవరు మా పార్టీ తరుఫున మాట్లాడటానికి? ఆ స్వామిజీ ఎవరు? వాళ్లు ఎవరు? మా పేరు ఎట్లా చెప్తారు? ఆ నందు ఎవ్వడు? నాకే నందూ తెలవదు?
అక్టోబర్ 27: అందులో ఒక్క నందు అనేటాయన నాకు తెలుసు. మా అంబర్పేటలో ఉంటారు. అక్కడ చిన్న హోటల్ పెట్టుకొన్నాడు.
అక్టోబర్ 27: సగటు రాజకీయ పార్టీ అని నీవే చెప్తావు. పార్టీ నాయకులను చేర్చుకోవచ్చునని నీవే చెప్తావు. నిన్న మొన్న మునుగోడులో మా పార్టీ నాయకులకు ఫోన్ చేసి చేరమని అడుగతావు. మేము చేర్చుకొంటే తప్పేమున్నది?
అక్టోబర్ 28: బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తే తప్పేమున్నది? మీ దగ్గరికి కూడా చాలామంది వేరే పార్టీల వాళ్లు వస్తరు. మీరు ప్రయత్నం చేసిన్రు అనుకో అందులో తప్పేమున్నది? అది తప్పనుకుంటమా? ఇందులో భయపడాల్సిన అవసరం ఏమున్నది?