కరీంనగర్: దేశంలోని అన్ని రాష్ర్టాల్లోకెల్లా తెలంగాణలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చాడు. కిరణ్ వర్మ అనే 25 ఏండ్ల యువకుడు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, దేశంలోని పలు రాష్ర్టాల్లో పర్యటిస్తున్నాడు. వారం రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ మంగళవారం కరీంనగర్ చేరుకున్నాడు.
కలెక్టరేట్ ముందు నుంచి వెళ్తుండగా ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. 8 నెలలుగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ర్టాల్లో 8,500 కి.మీ. పైగా పాదయాత్ర చేశానని, కానీ తెలంగాణలోనే రహదారులు అద్భుతంగా ఉన్నాయని కిరణ్ పేర్కొన్నాడు. గ్రామీణాభివృద్ధి కూడా మెరుగ్గా ఉన్నదని చెప్పాడు. ఇలాంటి పాలన అన్ని రాష్ర్టాల్లో ఉంటే దేశం అనతికాలంలోనే ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటుందని స్పష్టం చేశాడు.