హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే మెరుగైన స్థానంలో ఉన్నదని, ఈజ్ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ నగరం ఇతర మెట్రో నగరాలకంటే ఎంతో బేషుగ్గా ఉన్నదని బయోకాన్ ఫౌండర్, సింజీన్ ఇంటర్నేషనల్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్షా ప్రశంసించారు. గురువారం జీనోమ్ వ్యాలీలో సింజీన్ ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కిరణ్ మజుందార్ మాట్లాడుతూ… హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్నాయని కితాబిచ్చారు. ఎక్కడ మౌలిక వసతులు మంచిగా ఉంటాయో అక్కడ ఈజ్ ఆఫ్ లివింగ్ బాగుంటుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ లివింగ్లో బెంగళూరు కంటే హైదరాబాద్ గొప్పగా ఉన్నదని ప్రశంసించారు. బెంగళూరులో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ట్రాఫిక్తోపాటు అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గొప్ప మౌలిక వసతులను కల్పిస్తూనే మంచి పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని అభినందించారు. ప్రతి అంశాన్ని డైనిమిక్గా మార్చినందునే మంత్రి కేటీఆర్ను ప్రశంసిస్తున్నట్టు చెప్పారు. మంచి పర్యావరణ వ్యవస్థ (ఎకో సిస్టం) నైపుణ్యం ఉన్న యువతను ఆకర్షిస్తుందని తెలిపారు. ఎకో సిస్టం అంటే కార్యాలయాలు మాత్రమే కాదని, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడాఅని చెప్పారు.
సుస్థిర పారిశ్రామిక ఏకో సిస్టం విధానాలను విస్తృతంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కృషిని కిరణ్ మజుందార్ షా కొనియాడారు. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనూహ్య రీతిలో సహకరిస్తున్నదని తెలిపారు. 2020లో హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అడుగుపెట్టి అనతి కాలంలోనే ఉన్నత శిఖరాలను చేరుకొన్నామని, తాజాగా పదిహేడున్నర ఎకరాల్లో రిసెర్చ్ క్యాంపస్ విస్తరణతో మరో మైలురాయిని అందుకొన్నామని చెప్పారు. ఈ అడుగుతో జీనోమ్ వ్యాలీ కేంద్రంగా పరిశోధన, ఆవిష్కరణలో కొత్త ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. నైపుణ్యంగల మానవ వనరులు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయని, రానున్న రోజుల్లో ఇవే నిర్ణయాత్మకంగా మారుతాయని అన్నారు. ఎన్నో సానుకూలతలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య, వ్యాపార విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయని తెలిపారు. స్టార్టప్ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. సింజీన్ విస్తరణతో అదనపు ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయని, బయోటెక్నాలజీ పరిశ్రమ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెడుతామని తెలిపారు. 2047 నాటికి అంతర్జాతీయ సంస్థలకు 25 శాతం నిపుణులను అందించే స్థాయికి భారత్ చేరుకుంటుందని, అందులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని షా ఆశాభావం వ్యక్తంచేశారు.
జీనోమ్ వ్యాలీలో సింజీన్ కార్యకలాపాలను మరింత విస్తరించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. కిరణ్ మజుందార్ షాకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం సాయంత్రం ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందించిన కిరణ్ మజుందార్ షాకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో లైఫ్ సైనెన్స్ పరిశ్రమ, భవిష్యత్తు అవకాశాలపై కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యలు తనలో మరింత విశ్వాసం నింపాయని పేర్కొన్నారు.