హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని సులువుగా తెలుసుకోవడానికి కియోస్క్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. లండన్లో ప్రముఖ ప్రాంతాల స్ట్రీట్ మ్యాప్, అక్కడికి ప్రజా రవాణా వ్యవస్థ మొదలైన వాటి గురించి కియోస్క్ ద్వారా తెలుసుకోవచ్చని, వీటిని హైదరాబాద్, వరంగల్లాంటి నగరాల్లో ప్రవేశపెడితే బాగుంటుందని ట్విట్టర్లో ఓ యూజర్ ఇచ్చిన సలహాపై మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనిపై అధ్యయనం చేసి, మొదట హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్కు ఆదేశాలు జారీచేశారు. అలాగే, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సిరిసిల్ల ఫైన్ ఆర్ట్స్ కాలేజీ, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల విద్యార్థులు వేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించగా, దీనిపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభకు వారు గీసిన బొమ్మలు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.