హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): ల్యాప్రోస్కోపీ ద్వారా 11 మంది నుంచి కిడ్నీలు సేకరించారు ఉస్మానియా దవాఖాన వైద్యులు. ఈ పద్ధతిలో కిడ్నీలు సేకరించటం తెలుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో ఇదే తొలిసారి. వారం రోజులుగా కొనసాగిన ఈ ప్రక్రియలో భాగంగా 11 మంది దాతల నుంచి కిడ్నీలు సేకరించి, రోగులకు అమర్చినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ తెలిపారు. దాతలు, రోగులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వెల్లడించారు. దాతల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకే ల్యాప్రోస్కోపీని ఉపయోగిస్తున్నామని చెప్పారు. మంత్రి హరీశ్రావు ఆదేశాలతో దవాఖానలో వినూత్న మార్పులు చేశామని, వైద్య సేవలను మరింత విస్తరించామని వివరించారు. త్వరలో మరో 3 ఆపరేషన్ థియేటర్లు, 75 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో 50 మోకాలి చిప్పల మార్పిడి చేశామని పేర్కొన్నారు.