హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): అమెరికాలో హైదరాబాద్ యువకుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. నాచారంకు చెందిన సలీం కుమారుడు అబ్దుల్ మహమ్మద్(25) ఓహియోలోని క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసే అబ్దుల్ మార్చి 7 నుంచి ఫోన్ చేయడం లేదు. ఇంతలో కొందరు దుండగులు అబ్దుల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తాము డ్రగ్ మాఫియాకు చెందిన వారిమని, తామే అబ్దుల్ను కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. అతడిని విడిచిపెట్టాలంటే తక్షణమే 1,200 డాలర్లు పంపించాలని, డబ్బులు ఇవ్వకపోతే అబ్దుల్ కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. అమెరికాలోని బంధువుల ద్వారా క్లీవ్ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అబ్దుల్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మార్చి 18న షికాగోలోని భారత రాయబార కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు.