ఖైరతాబాద్, జూలై 17: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శమివ్వనున్నారు. మానవ మనుగడను కరోనా అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రళయ రుద్రావతారంలో ఆ మహమ్మారిని పారదోలాలని వేడుకుంటూ ప్రతిమను ప్రతిష్ఠిస్తున్నారు. ఈ మేరకు శనివారం లైబ్రరీ చౌరస్తాలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, శిల్పి రాజేంద్రన్ నమూనా చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సారి ఆదిశేషుడి నీడలో 40 అడుగుల ఎత్తులో దశ ఆయుధాలతో అభయమిస్తూ, సూర్యుడు, శ్రీ మహావిష్ణు, శివపార్వతుల ముఖాలతో పంచముఖుడిగా మహాగణపతి కనిపిస్తారు. పాదాల వద్ద దేవదేవుల వాహనాలైన గుర్రం, గరుత్మంతుడు, నందీశ్వరుడు, సింహాలు రుద్రరూపుని నమస్కరిస్తున్నట్టుగా ఉంటాయి. స్వామివారి కుడివైపు 15 అడుగుల ఎత్తయిన కాళికాదేవి, ఎడమవైపు కాలనాగేశ్వరి విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.