ఖైరతాబాద్, జూన్ 9: ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నది. 1954లో ప్రారంభమైన బడా గణేశ్ ప్రస్థానం 68 సంవత్సరాలుగా నిరాటకంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు పీవోపీ ద్వారా వైవిధ్యభరితమైన రూపాల్లో గణపతిని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలోనే మొదటిసారిగా మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన పద్ధతులతో రూపొందిస్తే విగ్రహం పింగాణిలా మారుతుందని శిల్పి రాజేంద్రన్ వెల్లడించారు. ఈ ఏడాది 50 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ గణేశుడి తయారీకి మార్కెట్లో దొరికే బాంబే మట్టిని వినియోగిస్తున్నారు. ఐరన్ రాడ్స్, స్టీల్మెష్తో విగ్రహ మౌలిక రూపాన్ని తయారు చేసుకొని బాంబే మట్టి, సుతిలి పౌడర్ మిశ్రమంతో విగ్రహానికి తుది రూపమిస్తారు. అనంతరం చక్కటి రంగులతో అలంకరిస్తారు. ఇలా తయారైన విగ్రహం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పీవోపీ కంటే బలంగా ఉంటుందని, పింగాణిలా మెరిసిపోతుందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు. 4 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసినా విగ్రహం చెక్కు చెదరదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ట్రాలీ మీద ఊరేగించవచ్చని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని మట్టితో ప్రతిష్ఠిస్తున్నామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్రాజ్ తెలిపారు. గురువారం సాయంత్రం గణేశుడి మండపం వద్ద కమిటీ సభ్యులు సింగరి రాజ్కుమార్, బాల్కుమార్, మహేశ్ యాదవ్తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. భారత అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కర్రపూజ నిర్వహిస్తామని, వారం, పది రోజుల్లో విగ్రహ నమూనాను విడుదల చేస్తామని తెలిపారు.