హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వివాదం తారస్థాయికి చేరింది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే దిశగా పార్టీ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రుల వరుస భేటీలు, కీలక వ్యాఖ్యలతో గోలగోలగా మారింది. ఇప్పటికే ఈ వివాదం పరిష్కార బాధ్యతను పార్టీ అధిష్ఠానం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే బుధవారం ప్రజా భవన్లో కొండా మురళి, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఒకేసారి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు సైతం భట్టితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. భేటీల సంగతి ఇలా ఉంటే అనంతరం భట్టి హుటాహుటిన బెంగళూరు వెళ్లారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక్కడి పరిణామాలపై పార్టీ అధ్యక్షుడికి వివరించడంతో పాటు నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతున్నది.
భేటీలపై చర్చ
కొండా మురళి, రాజగోపాల్రెడ్డి ఇద్దరూ ఒకేసారి భట్టితో భేటీ కావడం, వారిద్దర్నీ ఒకేసారి కూర్చోబెట్టి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. భేటీలో ఆ ఇద్దర్నీ బుజ్జగించారా? లేక బెదిరించారా? అనే చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ఇప్పటికే ఇటు మంత్రి కొండా సురేఖపై, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై వేటు వేయాలంటూ క్రమశిక్షణా సంఘం నివేదిక ఇచ్చింది. మంత్రి సురేఖపై వేటు వేస్తే అది పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన పార్టీ, ప్రభుత్వ పెద్దల్లో నెలకొన్నట్టు తెలిసింది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అందులోనూ మహిళ కావడంతో పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ఒకవేళ వేటు వస్తే అది ఒక్క కొండా సురేఖతో ఆగిపోదని, ఈ ప్రభావం ఎక్కడికి పోతుందోననే ఆందోళన నెలకొన్నట్టు తెలిసింది. ఒకవేళ ఇద్దరిపైనా వేటు వేస్తే ఆ తర్వాత చాలా మంది నేతలపై వేటు వేయాలనే డిమాండ్లు వినిపిస్తాయనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
ఇందులో భాగంగానే ఇటు భట్టి విక్రమార్క, అటు మంత్రులు కలిసి కొండా మురళి, రాజగోపాల్రెడ్డిని ఓవైపు బెదిరిస్తూనే మరోవైపు బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా మధ్యేమార్గంగా చర్యలు తీసుకోవడంపై మంత్రులు సమాలోచన చేసినట్టు సమాచారం. అయితే భట్టితో భేటీ తర్వాత ఇటు కొండా మురళి, అటు రాజగోపాల్రెడ్డి మరోసారి నిరసన గళా న్ని వినిపించడం హాట్టాపిక్గా మారింది. ఎ ప్పటిలాగే తమ తప్పేం లేదని వారు తేల్చిచెప్పారు. తన కూతురు వ్యాఖ్యలతో తనకేం సం బంధమని మురళి స్పష్టంచేయగా, అసలు తాను ఎవరికీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని రాజగోపాల్రెడ్డి చెప్పడం గమనార్హం.