హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండ లి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. శనివారం పాలకమండలి సమావేశం సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలపై చర్చించిన టీటీడీ..రెండేండ్ల తర్వాత ఆలయం వెలుపల జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. శాశ్వత వసతి కోసం గోవర్ధన్ అతిథి గృహం వెనుక రూ.95 కోట్లతో నూతన వసతి భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి రూ.6.37 కోట్లు ఇవ్వాలని తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు ఇండ్లస్థలాల మంజూరుకు 300 ఎకరాలు కేటాయించడంతోపాటు మరో 130 ఎకరాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు వీఐపీ దర్శన సమయాన్ని ఉదయం 10 నుంచి 12 గంటలకు మార్చింది.