సంగారెడ్డి /ఝరాసంగం, జనవరి2 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం మండల కేంద్రంలోని పార్వతి సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం శూన్యం అమావాస్య పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తుల శివ నామాస్మరణతో ఆలయ ప్రాగణం మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి యజ్ఞ మంటపంలో పార్వతీసమేత సంగమేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకంతో పాటు అన్నపూజ తదితర పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.