ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 10 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. పడియోరు (నాగోబా)ను దర్శించుకోవడానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాగోబా సన్నిధిలో 202 మంది కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం (బేటింగ్) నిర్వహించారు.
ఇందు లో భాగంగా కొత్తకోడళ్లు కోనేరు నుంచి కుండలలో నీటిని తీసుకొచ్చారు. అనంతరం కొత్తకోడళ్లకు నాగోబాను దర్శించుకునే అవకాశం కల్పించారు. సతిక్దేవత, నాగోబా దర్శనం అనంతరం కొత్తకోడళ్లు మెస్రం వంశీయుల పెద్దల ఆశీస్సులు పొందిన తరువాత కోడళ్లుగా స్వీకరించారు. మహిళలతోపాటు కొత్త కోడళ్ల ఆధ్వర్యంలో గోవాడ్లో 22 కితలవారీగా పూజలు చేసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అవ్వాల్ దేవతకు పూజలు చేసి ఉపవాస దీక్షలను విరమించి సామూహిక భోజనాలు చేశారు.