హైదరాబాద్, మార్చి 30 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 43.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చేప్రాలలో 43.8, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నుంచి 2- 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకొనే అవకాశం ఉంటుందని తెలిపింది. బంగాళాఖాతం నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తాయని, ఉత్తర, దక్షిణ ద్రోణి తెలంగాణపై ఏర్పడుతుందని, దీంతో వచ్చే వారం వర్షాలు వస్తాయని వెల్లడించింది.