హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహణ బాగుదంటూ కేరళ ఎన్నికల కమిషనర్ షాజహన్ ప్రశంసించారు. తమ రాష్ట్రంలో తెలంగాణ విధానాన్ని అమలు చేస్తామని, తమకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం కేరళ ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేయడానికి రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చారు. మసాబ్ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ పార్థసారధి, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థ్ధసారధి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతోనూ కేరళ అధికారులు భేటి అయ్యారు. సాఫ్ట్వేర్పై చర్చించారు. గురువారం ఈసీఐఎల్ను సందర్శించనున్నారు. సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ తదితరులు ఉన్నారు.