హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పేరుతో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ ఇండ్లలోని కుండీలు, నీరు నిల్వ ఉండటానికి ఆస్కారం ఉన్న పరిసరాలను శుభ్రం చేసి, ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చారు. ప్రజలంతా ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
ప్రతి ఆదివారం పది నిమిషాలు కార్యక్రమంపై రూపొందించిన ఒక లఘు చిత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, వివిధ గృహ సముదాయ సంక్షేమ సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్శాఖ ప్రతి శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు, ఇంకుడు గుంతలు, పూల మొక్కలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, తదితర వాటిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కరపత్రాలను పంపిణీచేశారు.