హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేర నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి సూచించారు. వివిధ నేరాల్లో నిందితులకు చట్టప్రకారం శిక్షలు పడటంతోనే నేరాలు నియంత్రణలోకి వస్తాయని పేర్కొన్నారు. బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు, వాటి దర్యాప్తు తదితర అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, విద్యార్థులపై నేరాలకు పాల్పడేవారిపట్ల కఠిన వైఖరితో ఉండాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్సింగ్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.