కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ. ఇంత కాలం ఆయన వెంబడి నడిచిన చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, ఇల్లందకుంట సింగిల్ విండో అధ్యక్షుడు పింగిళి రమేష్ బీజేపీకి రాజీనామా చేశాడు. ఇదే బాటలో సింగిల్ విండో డైరెక్టర్లు, ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు బీజేపీకి గుడ్బై చెప్పారు. ఆదివారం పట్టణంలోని సాయిరూప గార్డెన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాను పింగిళి రమేష్ ప్రకటించాడు. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా వామపక్ష భావజాలంతో పెరిగాం. ఈటల తీసుకెళ్లి బీజేపీలో కలిపారు. బీజేపీలో ఇమడలేక పోతున్నాం. బీజేపీ సిద్ధాంతాలు నచ్చక ఆ పార్టీలో నుంచి బయటికి వచ్చినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మరల టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
దేశం గర్వించదగ్గ దళిత బంధును ప్రకటించి రాష్ట్రంలోని దళితులందరికి ఆరాధ్య దైవంగా కేసీఆర్ మారాడన్నారు. పుట్టి పెరిగిన వాతావరణం మొత్తం దళితుల వాడలు, ఇళ్లల్లోనేనని, వాళ్ల తలరాతలు మార్చేందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దళిత బంధుతో దళితుల జీవితాలు మారిపోతాయన్నారు.
బీజేపీకి రాజీనామా చేసినవారిలో జమ్మికుంట మాజీ వైస్ ఎంపీపీ చుక్క రంజిత్కుమార్, ఇల్లందకుంట రామాలయ చైర్మన్ ఎక్కటి మధుసూదన్రెడ్డి, మాజీ సర్పంచ్లు మూడెడ్ల కుమారస్వామి, కాస శంకరయ్య, పౌరహక్కుల నాయకుడు ఎం. రత్నం, ఇల్లందకుంట సింగిల్ విండో డైరెక్టర్లు తిరుపతిరావు, కడిపికొండ తిరుపతిరెడ్డి, కె రవి, పోల్సాని సత్యనారాయణరావు, చందపట్ల జితేందర్రెడ్డి, గోళి సుధాకర్, మండల బీజేపీ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిండెంట్ జవ్వాజి చిరంజీవి తదితరులు ఉన్నారు.