ములుగు : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పాలనలో రాష్ట్రం అన్ని రంగాలు, సామాజిక వర్గాలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు. ములుగు జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) నియోజకవర్గస్థాయి ప్లీనరీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్ర వివక్షపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఆమె మాట్లాడుతూ కేసీఆర్(CM KCR) పాలన దళిత గిరిజనులకు స్వర్ణ యుగం(Golden Period)లాంటిదని అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకులకు(Congress leaders) ఆర్భాటమే తప్ప, ఏ ఒక్క పనిచేయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని అమలవుతున్న సంక్షేమపథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు ఈ దేశానికి ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు.
దేశంలో ఎక్కడికి వెళ్లిన ‘ అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అని కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యట్రిక్(BRS Hatrick) సాధించడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వృత్తుల వారికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని, గిరిజన , ఆదివాసీ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయస్థాయి గుర్తింపు ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారు.