బెల్లంపల్లి రూరల్, ఆగస్టు 5: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి భూసమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ చొరవ చూపారు. గ్రామంలోని గోనె వెంకట ముత్యంరావుకు చెందిన సర్వే నంబర్ 55లోని 499 ఎకరాలను 300 మంది రైతులు దశాబ్దాలుగా దున్నుకుంటున్నారు. వారికి పట్టాలు మంజూరు చేయకపోవడంతో రైతుబంధు, రైతుబీమా అందడం లేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం రాత్రి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఈ విషయాలపై వినతిపత్రం అందించారు. స్పందించిన సీఎం వెంటనే కలెక్టర్ భారతీహోళికేరితోపాటు తాసిల్దార్తో ఫోన్లో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం కలెక్టర్ రైతుల సమక్షం లో గ్రామసభ నిర్వహించి కాస్తుదారుల ధ్రువ పత్రాలను పరిశీలించారు. కలెక్టరే స్వయంగా రెవెన్యూ రికార్డులో ఉన్న కాస్తుదారుల పేర్లని పిలిచి వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలను సేకరించారు. సాగుదారుల వివరాలను సేకరించి వారి వద్ద ఉన్న ధ్రువపత్రాలను పరిశీలించి 24 గంటల్లో నివేదిక అందజేయాలని బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, తాసిల్దార్ కుమారస్వామి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్వరీలను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు జాప్యం చేయొద్దని సూచించారు. గ్రామసభలో సర్పంచులు పొట్లపల్లి ఉమాదేవి, పొలవేని మాధవి, ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్రావు, మండల ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీవో రాజేందర్, రైతులు పాల్గొన్నారు.