KCR’s National Party Launch LIVE UPDATES | తెలంగాణ రాజకీయ చరిత్రలో నవశకానికి నాంది పలికింది. ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి.. జాతీయ రాజకీయ పార్టీగా అవతరించింది. కేసీఆర్ అధ్యక్షతన దసరా పర్వదినాన తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్..
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనపై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇక ఇండియా నడుం బిగించాలి. లెజెండరీ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో అసమానమైన అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే మీరంతా అనుభవించబోతున్నారని తన ట్వీట్లో సంతోష్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించారని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్, కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికి అవసరమన్నారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని దివాళా తీయించారు.. ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ట మంటగలిపారని ధ్వజమెత్తారు.
కర్నాకటలో రాబోయే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి జెండా ఎగుర వేయాలని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. వచ్చే ఏడాదిలో కర్నాటకలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. కర్నాటకలో జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ కర్నాటకలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు దేశమంతా కేసీఆర్తో కలిసి తిరుగుతారని తెలిపారు.
దళిత బంధు అద్భుతమైన పథకమని నిఖిల్ కుమారస్వామి గౌడ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ సమావేశానికి వచ్చిన జేడీ నేత నిఖిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ విజన్ బాగుందని ఆయన మెచ్చుకున్నారు. తన విజన్తో తెలంగాణను అభివృద్ధి పథంలో కేసీఆర్ నడిపారని, అలాంటి విజన్ను ఇప్పుడు దేశవ్యాప్తం చేయాలని నిఖిల్ అన్నారు. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణలో అభివృద్ధి వేగంగా సాగిందన్నారు. దళిత బంధు పథకం అమేజింగ్గా ఉందని నిఖిల్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దళితుల్ని పట్టించుకోలేదన్నారు. రైతుల కోసం కేసీఆర్ అందిస్తున్న రైతు బంధు పథకం కూడా అద్భుతంగా ఉందని నిఖిల్ అన్నారు.
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందినందుకు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఓవైసీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సర్ధార్ పటేల్ రోడ్డులోని జోధ్పూర్ రాజ వంశీయుల బంగ్లా లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నూతన పార్టీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన నేపథ్యంలో వసంత్ విహార్లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. వచ్చే ఆరు నెలల్లో ఆ భవన్ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానం చేసినట్లుగా అందులో పేర్కొంది. >>Read More
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో నేతలు, కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్లో బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకుంటున్నారు. >> More Photos
భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. >>Read More
టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన పార్టీ అధ్యక్షులు కేసీఆర్.. #TRS #BRS #BRSParty pic.twitter.com/xYKlfJHaqy
— Namasthe Telangana (@ntdailyonline) October 5, 2022
తెలంగాణ భవన్ వద్ద గులాబీ శ్రేణుల సంబురాలు ఆకాశన్నాంటాయి. పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ అభిమాని ప్లకార్డు ప్రదర్శించారు. దేశ్ కా నేత.. టుడే సీఎం.. టుమారో పీఎం.. జై కేసీఆర్ సర్.. జై డీఎన్ఆర్ అన్న అని ప్రదర్శించిన ప్లకార్డు వైరల్ అవుతోంది. ఇక తెలంగాణ భవన్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. గిరిజనుల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. మరికాసేపట్లో కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నారో సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ వివరిస్తున్నారు. >> watch Video
అంతిమ విజయం ఎప్పటికీ ధర్మం వైపు నిలబడుతుంది రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు అదే ధర్మం తోడ్పడిందని తెలిపారు. విజయదశమి సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా గోదావరిఖనిలోని జయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పర్వదినమన్నారు.
ధర్మం గెలిచిన రోజును పర్వదినంగా జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ధర్మ యుద్ధంలో విజేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాదించిందాన్నారు. అదే ప్రగతి యావత్ భారతదేశానికి విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, అలాంటి ధర్మ పోరాటంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు.
కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా అయితే మారిందో.. అదే విధంగా దేశ భవిష్యత్తు కూడా మారుతుంది. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ బయలుదేరినప్పుడు కూడా ఇవే సందేహాలు.. ఇవే అనుమానాలు .. తెలంగాణ వస్తదా.. తెలంగాణ ఎట్ల వస్తది.. ఎట్లిస్తరు.. తెలంగాణ మీ వల్ల అయితదా.. అని మాట్లాడినరు. అయినా ఆ మాటలను లెక్క చేయకుండా కేసీఆర్.. టీడీపీ నుంచి ఒక్కడే బయటకు వచ్చిండు.. గుంపును జమచేసి తెలంగాణ తెచ్చిండు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కరెంటు ఉంది. నీళ్లున్నయ్, వ్యవసాయం పెరిగింది. తెలంగాణ ప్రజలు హాయిగా జీవిస్తున్నరు. తెలంగాణ ప్రజల మాదిరిగానే దేశ ప్రజలు బతకాలన్నదే మా నాయకుడు కేసీఆర్ ఆలోచన. తెలంగాణ ఇల్లు బాగుపడ్డది.. ఊరు బాగుపడ్డది.. పట్నం బాగుపడ్డది.. రాష్ట్రం బాగుపడ్డది.. ఇప్పుడు దేశం బాగుపడాలి. తెలంగాణలో ఏవిధంగా ప్రణాళికతో అభివృద్ధి చేసిండో.. ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో.. దేశవ్యాప్తంగా అవి అమలు కావలన్నది.. తెలంగాణలా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఆయన లక్ష్యం, ఆలోచన గొప్పది.. నిజాయతీగా చేస్తుండు కాబట్టి.. ఆయన కోరిక కచ్చితంగా నెరవేరుతదనే నమ్మకం ఉంది. జాతీయ పార్టీలు ఏ విధంగా అయితే పోటీ చేస్తయో అదే విధంగా మా పార్టీ పోటీ చేస్తది. గుజరాతే కాదు.. మోదీ నిలబడ్డచోట కూడా పోటీ చేస్తం.
- మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసీఆర్ విజనరీ నాయకుడు. ఆయనకున్న సంకల్పంతో తెలంగాణను సాధించడమే కాకుండా.. అభివృద్ధిని చూపించారు. వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు వచ్చాయి. ఈ అభివృద్ధిని దేశవ్యాప్తంగా చూపించాలని అనుకుంటున్నారు. కచ్చితంగా మనం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాం.
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ధూంధాం పాటల ద్వారా ప్రజలను ఏ విధంగా జాగృతం చేశామో.. అలాగే ఇప్పుడు కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు.. దేశంలోని విపత్కర పరిస్థితులన్నింటి మీద హిందీలో పాటలు రాసి దేశ ప్రజలను జాగృతం చేసేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఎలాంటి పాటలున్నయ్.. ప్రజలు కోట్లాదిగా ఎట్లా కదిలినరో .. అట్లాగే భారత దేశ ప్రజలను ఏకీకృతం చేసే పాటలు తయారు చేస్తం.
- రసమయి బాలకిషన్
దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో ప్రకటించనున్న బీఆర్ఎస్ పార్టీకి దేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టాలని కోరుకుంటున్నా. విజయ దశమి రోజున జాతీయ పార్టీ పేరును ప్రకటిస్తున్నందున బీఆర్ఎస్కు అన్ని విజయాలే జరుగుతాయని ఆశిస్తున్నా
- జోగు రామన్న
దసరా పర్వదినాన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సందర్భంగా విజయం చేకూరాలని భగవంతుణ్ని కోరుకుంటున్నాం. దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు చరమ గీతం పాడేందుకు ఇది తొలి మెట్టుగా భావిస్తున్నాం.
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే అధినేత తిరుమాళవన్, పలువురు ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ తప్పక విజయం సాధించి.. గొప్ప నాయకుడైతడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్న నేపథ్యంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడు. "పాండవులు.. కౌరవుల మీదికి యుద్ధానికి పోయినప్పుడు.. భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని .. అక్కడి నుంచి జమ్మి చెట్టుకు పూజ చేసి.. బయలుదేరి కౌరవుల మీద విజయం సాధించారు. ఇవాళ మన తెలంగాణ సీఎం కేసీఆర్ జమ్మి పూజ చేసి.. అమ్మవారిని దర్శనం చేసుకుని బీజేపీ నేతలపై మధ్యాహ్నం 1.19 నిమిషాలకు యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తప్పక విజయం సాధిస్తాడు. గొప్ప నాయకుడైతడు. ప్రధాన మంత్రి అయితడు"
జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన నేతలతో టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో వారికి అల్పహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా నేతలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అల్పహారం సర్వ్ చేశారు.
తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమాళవన్ సైతం కేసీఆర్ను కలిశారు. ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి తిరుమాళవన్ ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలతో సీఎం కేసీఆర్ అల్పాహార విందులో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ పార్టీకి సంబంధించి కీలక ప్రకటన నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు నగరానికి చేరుకుంటున్నారు. మరో వైపు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు సైతం తరలివస్తున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రగతి భవన్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన సమావేశమయ్యారు. ఆయనతో పాటు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని, జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ గ్లోబర్ ఎన్నారై కో ఆర్డినేటర్ పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరమన్న తీర్మానానికి 52 దేశాల ఎన్నారై ప్రతినిధులతో మద్దతు కూడగట్టిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. తీర్మానం ఈ విజయ దశమని రోజున కార్యరూపం దాల్చుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
దేశ్ కీ నేత కేసీఆర్ అన్న బ్యానర్లు ఇప్పుడు హైదరాబాదీలను అట్రాక్ట్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు నగరంలో వివిధ ప్రాంతాల్లో భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో ఇవాళ జరగనున్న ఆ పార్టీ సర్వసభ్య సమావేశం నేతృత్వంలో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన పోస్టర్లు అందర్నీ స్టన్ చేస్తున్నాయి.