కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి, వచ్చిన సంపదను పేదలకు పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి మండలాలకు చెందిన 142 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. కోటి 42 లక్షల 16,472 లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధుతోపాటు అనేక గొప్ప పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వo నిరుపేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలవాలనే ఆలోచన రాలేదన్నారు. స్వయంపాలన లో కేసీఆర్ అన్నగా, మేనమామగా నిరుపేద ఇంటి ఆడబిడ్డలకు అండగా ఉంటానని కల్యాణ లక్ష్మి , షాదీముబారక్ పథకాన్ని చేపట్టారన్నారు.
పేద ఆడబిడ్డ పెళ్లయిన నెల రోజుల్లోనే చెక్కులు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ తో ఉచితంగా కాన్పులు, ఉన్నత వర్గాలకు ధీటుగా మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల్లో ప్రతి విద్యార్థికి సంవత్సరానికిరూ. 1. 25 లక్షలు వెచ్చించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, కొత్తపెళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జడ్పీటీసీలు,కార్పొరేటర్లు, సర్పంచులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.