హైదరాబాద్, అక్టోబర్ (నమస్తే తెలంగాణ): దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతోపాటు దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా విజయ దశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు. కార్యదీక్షులను అపజయాల నుంచి విజయాల దిశగా నడిపిస్తూ, ఏనాటికైనా ధర్మానిదే అసలు విజయం అనే స్ఫూర్తిని దసరా పండుగ మనకు అందిస్తున్నదని పేర్కొన్నారు. దసరా పండుగ విశిష్టతను గౌరవిస్తూ జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా కేసీఆర్ బుధవారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతోపాటు విజయ దశమి స్ఫూర్తి ఇమిడి ఉన్నదని, అదే స్ఫూర్తితో పదేండ్ల పాలనలో ప్రజలను విజయాల దిశగా నడిపించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలు ఓటమి నుంచి గెలుపు దిశగా పయనించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. నిత్య శుభాలతో ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా దీవించాలని దుర్గామాతను ప్రార్థించారు.