హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసే దిశగా పాలన అందించిననాడే వారికి ఘన నివాళి అర్పించిన వారమవుతామని స్పష్టంచేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి శుక్రవారం సందర్భంగా ఆయన త్యాగాలను, స్ఫూర్తిని కేసీఆర్ స్మరించుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం సాగిన చివరి దశ పోరాటంలో, ఉద్యమ రథ సారథిగా తనను ముందు నడుపుతూ ఆయన అందించిన ప్రోత్సాహం జీవితంలో మరువలేనిదని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధన కోసం అనుసరించాల్సిన పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యూహాలకు తన ఉద్యమ కార్యాచరణకు ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన సైద్ధాంతిక నైతిక మద్దతు మహోన్నతమైనదని కేసీఆర్ కొనియాడారు.