KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. అంతకు ముందు ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. అలాగే, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం, తదితర నిర్మాణాత్మక కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.