పెద్దపల్లి, జూన్ 25 (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్: ప్రపంచ చరిత్రలో కాళేశ్వరం అనే అద్భుత అధ్యాయానికి శ్రీకారంచుట్టి రెండేళ్లుగా తెలంగాణ బీళ్లకు సాగు నీటిని అందిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కాంస్య విగ్రహాన్ని మేడిగడ్డ లక్ష్మి బరాజ్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఏపీలోని ధవళేశ్వరం వద్ద బ్రిటిష్ జనరల్, ఇంజినీర్ జనరల్ సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహాన్ని నెలకొల్పగా.. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ఆరడుగుల విగ్రహాన్ని లక్ష్మి బరాజ్ వద్ద ప్రతిష్ఠించేందుకు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నుంచి రోజూ 2 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ 170 టీఎంసీల నీటి వినియోగమే లక్ష్యంగా తెలంగాణలోని 13 జిల్లాలకు లబ్ధి కలిగే విధంగా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తుండటంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞత పూర్వకంగా విగ్రహం ఏర్పాటుచేయాలని సంకల్పించారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో ఉండే మహదేవపూర్ మండ లం మేడిగడ్డ లక్ష్మి బరాజ్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి శుక్రవారం పుట్ట మధూకర్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. బీడువారిన భూములను సస్యశ్యామలం చేస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్దేనన్నారు. అలాంటి మహనీయుని మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడే ప్రారంభమైనందున బరాజ్ వద్ద కేసీఆర్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.