హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాజకీయమంటే అమ్ముడు, కొనుడే అన్న తీరుగా మార్చేసిన బీజేపీపై పోరాటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు యావత్ తెలంగాణ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఆసన్నమైందని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీని పారద్రోలేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం అవసరమన్న కేసీఆర్ మాట అక్షర సత్యమని పేర్కొంటున్నారు. బీజేపీ దుర్మార్గ రాజకీయాలకు జడిసి మౌనందాల్చిన శక్తులన్నీ ఇప్పుటికైనా ముందుకొచ్చి కేసీఆర్కు మద్దతివ్వాలని సూచిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బీజేపీ బ్రోకర్లు చెప్పిన పచ్చి నిజాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని, భీకర రాజకీయ దాడులు తప్పవని తెలిసినా బీజేపీ బట్టలిప్పి బజార్లో నిలబెట్టడం సాహసోపేత చర్యేనని అంటున్నారు. బీజేపీ రాక్షస రాజకీయ క్రీడను అరటిపండు ఒలిచినట్టు విప్పిచెప్పిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణను, దేశాన్ని రక్షించుకొనేందుకు చిన్నచిన్న విబేధాలున్నా మర్చిపోయి సమైఖ్యంగా ముందుకు కదలాలని పేర్కొంటున్నారు.
ఒక్కటవుతున్న పోరాట శ్రేణులు
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ పార్టీ సిద్ధాంతాలను విమర్శించే మేధావులపై ఒక పద్ధతి ప్రకారం దాడులు మొదలయ్యాయి. కర్ణాకట, మహారాష్ట్ర తదితర చోట్ల మేధావుల హత్యలు కూడా చోటుచేసుకొన్నాయి. దీంతో బీజేపీ రాజకీయాలను వ్యతిరేకించే మేధావివర్గమంతా సైలెంటై పక్కకు తప్పుకొన్నది. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో మళ్లీ వారిలో కదలిక వచ్చింది. తెలంగాణలో కళాకారులు స్వరం సవరించాలని ఉద్యమకారులు కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి అవసరమైన ప్రతిసారీ ఊపిరిలూదిన యువత బీజేపీపై పోరుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిస్తున్నారు. ఇన్నాళ్లకు బీజేపీని శక్తిమంతంగా ఢీకొట్టే సమ ఉజ్జీ దొరికాడని వ్యాఖ్యానిస్తున్నారు. వీడియోలు విడుదల చేసిన మరుక్షణమే జాతీయ మీడియా సైతం ఈ వీడియోలనే ప్రసారం చేయటం మొదలుపెట్టింది. ఉత్తరాది రాష్ర్టాల్లో సైతం ప్రజలు ఈ వీడియోలను ఆసక్తిగా తిలకించారు.
ఇది కదా ధీరత్వం
బీజేపీని ఢీకొట్టడం అసాధారణ చర్య అని తెలిసినా సీఎం కేసీఆర్ ధైర్యంగా ముందడుగు వేశారని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. ఇది కదా ధీరత్వం అని సీనియర్ జర్నలిస్టులు, నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. చదువురాని సామాన్యులు సైతం వీడియోల్లో బీజేపీ బ్రోకర్లు చెప్పిన విషయాలపై చర్చించుకోవటం కనిపిస్తున్నది. అసలు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తున్నదా? కేంద్ర క్యాబినెట్ అంటే చాయ్ పే చర్చ అనుకొంటున్నారా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలను కూలదోసేందుకు వందలు, వేలకోట్లు బీజేపీకి ఎక్కడి నుంచి వస్తున్నాయని సీఎం కేసీఆర్ వేసిన సూటి ప్రశ్నను నెటిజన్లు సోషల్మీడియాలో రిపీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో ఉన్నదని, దేశ యువత, మేధావులు, రైతులు, సామాన్యులు అన్న తేడా లేకుండా అందరూ కేసీఆర్ చూపిన మార్గంలో కదలకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ పండితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.