హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): 95 ఏండ్ల వయసులో గ్రామ సర్పంచ్గా పోటీ చేసి, విజయం సాధించిన జీ రామచంద్రారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. ప్రజాసేవ చేసేందుకు వయసు అడ్డురాదని నిరూపించారంటూ కొనియాడారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జగదీశ్రెడ్డి గురువారం కేసీఆర్కు తెలియజేశారు. 95 ఏండ్లుపైబడిన రామచంద్రారెడ్డి ఎన్నికల్లో యువకులతో పోటీపడటం, గెలుపొందడంపై కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
వెంటనే రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి అభినందించారు. అద్భుతమైన విజయం సాధించారని, మీ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. గ్రామ పాలనలో మీ అనుభవంతో మంచి ముద్ర వేయాలని, దేశానికి నాగారం ఒక మాడల్గా నిలువాలని ఆకాంక్షించారు. 95 ఏండ్ల వయసులో నేటి యువతతో పోటీపడి ప్రజాసేవకు ముందుకు రావడం, ప్రజల ఆదరణ పొంది గెలవడం ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఈ సం దర్భంగా కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని కేసీఆర్ అభిలషించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి కేసీఆర్తో మాట్లాడుతూ.. సీఎంగా మళ్లీ మీరే రావాలని, మరోసారి తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
కేటీఆర్ అభినందనలు
రామచంద్రారెడ్డికి కేటీఆర్ కూడా ఫోన్ చేసి అభినందించారు. సుదీర్ఘ జీవిత అనుభవాన్ని రంగరించి, నాగారం గ్రామ అభివృద్ధిలో ముం దుండాలని ఆకాంక్షించారు. నాగారం గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయం అందించడానికి తాను సిద్ధమని, రామచంద్రారెడ్డి గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తారన్న నమ్మకం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
ఉభయ రాష్ర్టాల్లో రికార్డు
తెలుగు రాష్ర్టాల్లో 95 ఏండ్ల వయసులో సర్పంచ్గా విజయం సాధించిన వ్యక్తిగా రామచంద్రారెడ్డి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం 95 ఏండ్ల వయసులో ఎవ్వరూ పోటీచేసి విజయం సాధించలేదు. ఏపీ, తెలంగాణలో రామచంద్రారెడ్డి విజయం ఒక రికార్డు అని విశ్లేషకులు చెప్తున్నారు.