నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. అది ఏం తెచ్చింది? మేకిన్ ఇండియాతో ఏం వచ్చింది? మేకిన్ ఇండియా నిజమైతే పేటపేటకు, పూటపూటకు చైనా బజార్ ఉంటదా? ఇండియాలో వేర్ ఈజ్ భారత్ బజార్?
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ‘నెయిల్కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజాదారాలు, హోలీ రంగులు, ఆఖరికి మొన్న కరోనా సమయంలో డాక్టర్లు వేసుకొనే కిట్లు కూడా చైనా నుంచే. మరి మీరు చెప్పిన మేకిన్ ఇండియా ఎక్కడ? అది ఏం తెచ్చింది? దాంతో ఏం వచ్చింది? మేకిన్ ఇండియా నిజమైతే పేటపేటకు చైనా బజార్ ఎందుకు ఉంటది? ఇండియాలో మరెక్కడా భారత్ బజార్ లేదెందుకు?’ అని ప్రధాని మోదీని భారత సమాజం నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పుష్కలంగా నీటి వనరులున్నా, కరెంటున్నా ఏవీ రావని, అన్ని అంశాల్లోనూ అదే దుస్థితి అని నిప్పులు చెరిగారు. అందుకు కేంద్రం అనుసరిస్తున్న దరిద్రమైన, లోపభూయిష్టమైన పాలసీలేనని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్లో ఏపీకి చెందిన నాయకులు చేరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మరోసారి మోదీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిప్పుల చెరిగారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..
భారత బజార్లు ఎక్కడని ప్రశ్నించండి
చైనా మన పక్కనే ఉంటది. హిమాలయాలకు అటు వైపు వాళ్లు, ఇటువైపు మనం. మావో విప్లవం తెచ్చారు. 1980లో చైనా జీడీపీ మన కంటే తక్కువ. 16 శాతం సాగుకు యోగ్యమైన భూమి ఉన్నది. డెంగ్ జియోపింగ్ ఆ దేశ పాలన పగ్గాలను చేపట్టాక ప్రగతి మొదలైంది. ఇప్పుడు చైనా ఎక్కడ ఉందో మనం కండ్లారా చూస్తున్నాం. నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు, మన జాతీయ పతాకాలు, టపాసులు, మన పిల్లలు ఎగరేసే పతంగులకు మాంజా దారాలు, హోలీ రంగులు ఇవన్నీ చైనా నుంచే. మరి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని ఇచ్చిన మేకిన్ ఇండియా నినాదం ఏమైంది. పూటపూటకు చైనా బజార్ ఉంటదా? ఇండియాలో వేర్ ఈజ్ భారత్ బజార్? దయచేసి ఆలోచించాలి. మూగబోయి ఉన్నా, తెలిసీ తెలియనట్టు నటిస్తే భారత సమాజం చాలా భయంకరంగా దెబ్బతింటది. అది ఏరకంగానూ వాంఛనీయం కాదు. తప్పకుండా మనం ఆలోచించాలె. ఆలోచన లేనివాళ్లకు ఆలోచన కలగజేయాలి. 100 శాతం ఫలితాలు వస్తాయి. రాదనే సమస్యే లేదు. సమాజం ఎప్పుడయితే జాగృతమైతదో సమస్యలు పరిష్కరమవుతాయి.
నెపాలు చెప్తేవాళ్లు నాయకులు కారు
దేశంలో 75 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఉన్న 41 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చు. ప్రతి ఇంచు భూమినీ తడపవచ్చు. మొత్తం వరి పండించినా 40 వేల టీఎంసీలు చాలు. సిన్సియర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే మరెందుకు నీటి యుద్ధాలు వస్తున్నాయి? దీనిని ప్రశ్నించాలి. కారణం ఒక్కటే దరిద్రమైన నీటి పాలసీ. బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ఇండియా. మన కండ్లారా చూశాం. తెలంగాణలో కూడా లేకుండే కరెంటు. ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో, వస్తే ఎంతసేపు ఉంటదో భగవంతుడికే తెలుసు. అనేక మంది రైతులు బాయిలకాడికి రాత్రి పూట పోయి పాము, తేలు కాట్లతో చచ్చిపోయారు. ఇప్పుడు ఎలా వస్తున్నది 24గంటల కరెంటు? కేసీఆర్ ఏం జేసిండు? కేసీఆర్ స్విచ్లో వేలు పెట్టిండా? ఒక్కటే..! ఒళ్లు వంచాలె. మెదడు కరగదీయాలె. తపన పడాలె. తపనపడే టీమును తయారు చేసుకోవాలె. అప్పుడు కచ్చితంగా సాధ్యమైతది. సాధ్యం కాని ప్రశ్నే లేదు. నెపాలు చెప్పేటోళ్లు నాయకులు కారు. నెపాలు చెప్తే సింగపూర్, చైనాలు తయారు కావు.
భారీ రిజర్వాయర్లు నిర్మిస్తే నీటి యుద్ధాలు ఉండేవా?
మనకు అన్ని వనరులు ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏవీ రావు. వీ ఆర్ జాక్ ఆఫ్ ఆల్. మాస్టర్ ఆఫ్ నన్. బకెట్ నీళ్ల కోసం చెన్నై తండ్లాడాలా? తన్నీర్ తన్నీర్ అనే సినిమా రావాల్నా? దాని చూసి పండ్లు ఇకిలించడం తప్ప పరిష్కారాన్ని ఇప్పటికీ ఆలోచించని దుస్థితి. మనకు గంగ ఉన్నట్టే చైనాలో యాంగ్జీ నది ఉంటది. హిమాలయాల్లోనే పుట్టి ప్రవహిస్తది. మంగోలియన్ సరిహద్దుల్లో నీళ్లు లేవు. దానిపై 1,000 టీఎంసీల బరాజ్ కట్టుకున్నరు. లాస్వెగాస్లో నీళ్లు లేకపోతే 600 కిలోమీటర్లు తీసుకెళ్తున్నారు. జింబాబ్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ దాదాపు 6,600 టీఎంసీల సామర్థ్యంతో కట్టారు. అట్లాంటి రిజర్వాయర్లు మూడు నాలుగున్నయ్. త్రిగోర్జెస్ డ్యామ్ 1,450 టీఎంసీల కెపాసిటీ. ఆ తరువాత అమెరికా కొలరాడోలో ఉన్న హూవర్ డ్యామ్ కెపాసిటీ 1,200 టీఎంసీలు. మరి మన దేశంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. మరోవైపు కరువులు వస్తాయి. అలాంటి భారీ రిజర్వాయర్లు దేశంలో ఒక్కటన్న ఉండదా? ఎక్కడ నిర్వీర్యమైపోయింది భారత శక్తి? ఎందుకు ఆ ఆలోచన వస్తలేదు? భారతదేశం లాంటి దేశం చక్కటి వర్షపాతం, సువిశాల భూభాగమున్న దేశంలో మూడు నాలుగు డ్యామ్లు ఉండి ఉంటే కరువు రాదు కదా! మంచినీళ్ల గోస ఉండదు కదా! నీటి యుద్ధాలు ఉండవు కదా! ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలు. చాలా సులభంగా పరిష్కరించే సమస్యలను కూడా కేంద్ర పాలకులు కథలు చెప్పి ప్రజలను వంచిస్తున్నారు. తలచకుంటే చేయగలం.
వ్యవస్థ కోసం వ్యక్తులు పనిచేయాలి
మన దేశంలో ఎమ్మెల్యే కాగానే కొమ్ములొచ్చేస్తయ్. భాష, వేషం అన్నీ మారిపోతాయి. వ్యక్తులు వ్యవస్థ కోసం పనిచేయాలి. మహాత్మాగాంధీ, భగత్సింగ్ వంటి అనేక ఆదర్శమూర్తులు ఆ కోవకు చెందినవారే. ఆ స్ఫూర్తి తీసుకొని వ్యక్తులు వ్యవస్థ కోసం పనిచేయాలనే అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నం. మన పక్కనే ఉన్న సింగపూర్ ఆసియా ఖండంలోనే అద్భుతమైన ప్రగతి సాధించింది. ఏమున్నది సింగపూర్లో. వాళ్లు తినే అన్నం ముద్దలో బియ్యం, పప్పు ఏది వారిది కాదు. చివరకు మంచినీళ్లు కూడా లేవు. ఆ దేశం చుట్టుకొలతనే 193 కిలోమీటర్లు. కేవలం మత్తుపదార్థాలు అమ్ముకుంటూ, చేపలు పట్టుకుంటూ, ఏమి లేని చోటు. కానీ ఆ దేశాన్ని అద్భుతమైన, అంకితభావం కలిగిన లీన్ కవాన్ యూ అనే నాయకుడు ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. నీళ్లు లేని సింగపూర్కు నేడు ప్రపంచమే పరుగెత్తుకు వచ్చేలా నిర్మించారు. ఇటీవలే బడ్జెట్ మిగిలిందని చెప్పి ఆ దేశంలోని ఒక్కో వ్యక్తికి 300 డాలర్లు పంచారు. అది దేశం ఎదగటం అంటే. నాయకత్వ లక్షణమంటే.