KCR | కరెంటు ఇవ్వ తెలివి లేదు.. చేతనైతలేదని కాంగ్రెస్ బాజాప్తా ఒప్పుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మీ తొత్తు పేపర్ల తప్ప.. నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో వస్తది. నిజాయితీ పేపర్లు ఏంటివో.. తొత్తు పేపర్లు ఏంటివో రేపు బయటపడుతది. ఇంకో విషయం నాకు మనసునపడుతలేదు. నేను బాధతో చెబుతున్న ఈ మాట. కొత్తది మీకు చేతనైతదా లేదా వేరే సంగతి. ముందుకాలం ఉన్నదే అదే రుజువు చేస్తుంది. మీ సమర్థత, శక్తి, తెలివితేటలు ఏందో అన్నీ బయటపడుతయ్. ఏడాదిలోనే మీ రంగు మొత్తం తేలెటట్టున్నది. నడిచింది కదా? తొమ్మిదేళ్లు కరెంటు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు.. గత సంవత్సరం ఇదే ఎండాకాలం అత్యధికంగా వచ్చిన పవర్లోడ్ 14,900 మెగావాట్లు. దాని తర్వాత మొన్న ప్రధానమంత్రి వచ్చాక జాతికి అంకితం చేసిండు. మేమే వెంబడి పటి కట్టించాం. భూమి కావాలంటే ఇచ్చాం. రామగుండం వెళ్లి ఎన్టీపీసీతో ప్రాజెక్టును కట్టించాం. 1600 మెగావాట్ల కరెంటు అదనంగా వచ్చింది. 1400 మెగావాట్లు మన సొంతం’ అని తెలిపారు.
‘ఈ సీజన్లో అత్యధికంగా పీక్ లోడ్ వచ్చింది 15,600 వచ్చింది. మా ప్రభుత్వం ఉన్నప్పటి కంటే 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. అదనంగా 1400 మెగావాట్లు వచ్చినప్పుడు కరెంటు ఎందుకు లోటు ఏర్పడుతుంది. దీనికి ఎవడు కారణం. అందరూ ఆలోచించాలి. పవర్ లేదా? అంటే ఉన్నది. తొమ్మిదేళ్లు నడిచింది. అంతకు ముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే.. సంవత్సరంలోనే కష్టపడి పరిష్కరించాం. పీఆర్ స్టంట్లు చేయకుండా కష్టపడి 7600 స్థాపిత కరెంటును.. 18,600కి తీసుకెళ్లాం. బ్రహ్మాండంగా నడిపాం. మళ్లీ 1600 మేం చేసిన కృషితో వచ్చింది. మరి ఎందుకు పవర్ శాటేజ్ అవుతుంది? మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, చేతగాని చవలు అని అర్థమవుతున్నది. మీకు నడపడం చేతకాదు. తెలివి లేదు. మేం అసమర్థులం.. తెలివిలేదు మాకు.. మాతోటి చేతనైతలేదని బాజాప్తా చెప్పాలి. మళ్లీ కేసీఆర్ చెప్పనుండే అంటరా? ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ.. పీఆర్ స్టంట్లు పెట్టుకుంటూ.. లంగా మాటలు మాట్లాడుకుంటా.. పిచ్చిపిచ్చి కథలు చేస్తున్నరు’ అంటూ ధ్వజమెత్తారు.
‘నిజంగా ప్రజలను మంచి చూడాలి.. పంటలు పండాలి.. రైతులుబాగుండాలి.. నా గ్రామాలు.. రైతులు కళకళలాడాలి.. వాళ్ల మొఖాలపై చిరునవ్వు ఉండాలనే కోరిక ప్రభుత్వానికి ఉండాలి కదా? బలమైన కాంక్ష హృదయంలో ఉండాలి. మేం ఆరోజు ఏం చేశాం. ఆగమై చెట్టుకొకరు.. గుట్టకొరైన తెలంగాణ రైతులు.. గ్రామాలను వదిలి.. ఆటో రిక్షాలు, ఇతర పనులు, కూలీ పనులు చేసేందుకు వెళ్లిన రైతులను తిరిగి గ్రామాల్లోకి వచ్చేలా చేసి.. చిన్నాపెద్ద రైతులను ఆదుకున్నాం. ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన వ్యవసాయ రాష్ట్రం కావాలనే దీక్ష పట్టాం. పట్టుబట్టి ఐదారు వసతులు కల్పించాం. రైతుబంధు చరిత్రలో ఎవరూ వేయలేదు. ఎందరో ముఖ్యమంత్రులే అయినా ఇవ్వలేదు’ అన్నారు.
‘అశోక్ గులాటీ అనే ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో చర్చలు జరిపాం. ఆయన ఒకటో సలహా ఇచ్చారు. మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో తెలియదు. కానీ రైతులకు అన్ని దేశాల్లో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తయి. రైతులకు సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి అంతర్జాతీయంగా ఉన్నది. రైతు నిలబడాలంటే.. అప్పు తీసుకోని పరిస్థితి రావాలంటే.. సొంత పెట్టుబడి ఉండాలంటే.. రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పారు. ఆ రోజు చర్చలు జరిగాయి. అశోక్ గులాటి చెప్పిందేందంటే.. ఎంత ఇవ్వదలచుకున్నారో ఎకరానికి ఇంత డబ్బులు సహాయం చేయాలని చెప్పారు. మొదట మేం రూ.4వేలతో సహాయం ప్రారంభించాం. సంవత్సరానికి ఎకరానికి రూ.10వేలు చేశాం. రైతుబంధును అదునుమీద వేసేది. కానీ, ఇవాళ చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నరు మీ తెలివితక్కువతనం వల్ల. మేం జమ చేసిన రూ.7వేల కోట్లు.. కాంట్రాక్టర్లకు, తాబేదార్లకు బిల్లు చెల్లించి.. రైతులనోట్లో మట్టిగొట్టారు. దాంతో రైతులు ఇవాళ రైతులు వడ్డీలు తెచ్చుకున్నారు. ఇవాళ రైతులు మునిగిపోయారు. దీనికి ఎవడు జిమ్మేదారి’ అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.