(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): దేశంలో జాతీయ నేతలు కరువయ్యారని, ఆ లోటును తీర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా మారాలని బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ కోరారు. వినూత్న పథకాలతో తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న కేసీఆర్, దేశానికి మార్గదర్శిగా మారాలని అభిలషించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడారు.
నేడు దేశంలో హిందూ, ముస్లింలను విడదీస్తూ.. కుల మతాల ఆధారంగా రాజకీయాలు సాగుతున్నాయని, ఎక్కడా నిఖార్సయిన జాతీయ నాయకులే కానరావటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితులు రావచ్చని అంబేద్కర్ 1938లోనే తన పుస్తకం ‘థాట్స్ ఆఫ్ పాకిస్థాన్’లో తెలిపారని గుర్తుచేశారు. నాయకులు తమ స్వార్థం కోసం హిందువులను, ముస్లింలను విడదీసి పబ్బం గుడుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వాజపేయి తరువాత నాకు జాతీయ నేత ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు దేశంలో ప్రాంతీయ నాయకులే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో వినూత్న పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ తన ఆలోచనలతో దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా మారాలి’ అని కోరారు.
సామాజిక అసమానతలు తగ్గిస్తున్న కేసీఆర్
తెలంగాణలో దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షల సాయం అందిస్తూ దళితుల ఆర్థిక స్వావలంబనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రకాశ్ అంబేద్కర్ కొనియాడారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడిచినా అంబేద్కర్ ఆశయాలు పూర్తిగా నెరవేరలేదు. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ ఓ అడుగు ముందుకేసి అంబేద్కర్ ఆశయాలకు ఓ రూపమిస్తున్నారు. సామాజిక అసమానతలు తొలగించటానికి ప్రయత్నిస్తున్నారు’ అని ప్రశంసించారు. అంబేద్కర్ అన్ని వర్గాల అభివృద్ధి కోరుకొన్నారు. దళిత, గిరిజనులే కాదు.. సమాజంలో ఇతర అణగారిన వర్గాలు కూడా అభివృద్ధిపథంలోకి రావాలని పోరాడారు. సమాజ అభివృద్ధికి చిన్న రాష్ర్టాల ఏర్పాటు అవసరమని అంబేద్కర్ నొక్కి చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఏర్పాటు చేయాలంటూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసేవరకు ఈ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు’ అని గుర్తుచేశారు.
కేసీఆర్ ముందడుగేస్తే మిగతా వారూ అనుసరిస్తారు
రూపాయి విలువను స్థిరీకరించేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టాలని ప్రకాశ్ అంబేద్కర్ కోరారు. ‘దళితబంధు ద్వారా దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ పథకం ద్వారా దళిత కుటుంబాలకు ఇస్తున్న రూ.10 లక్షల ప్రస్తుత విలువ ఏడాది తరువాత కూడా అలాగే ఉంటే ప్రయోజనం. కానీ, ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ వల్ల ఏడాది తరువాత రూపాయి విలువ తగ్గిపోతుంది. ఈ విధాన లోపాన్ని అంబేద్కర్ ఆనాడే గుర్తించారు. ఆయన ఆశయాల మేరకు ఈ వ్యవస్థ లోపాన్ని కేసీఆర్ సరిదిద్దాలి. కేసీఆర్ ఆ బాధ్యతను స్వీకరించి ముందడుగేస్తే మిగతా ముఖ్యమంత్రులూ ఆయన వెంట నడుస్తారు’ అని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు.
కొత్త జ్యోతిని వెలిగించిన కేసీఆర్
హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్కు ప్రకాశ్ అంబేద్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ఏటా దేశంలో పాటలు పాడి, డోలు వాయిద్యాలతో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకొంటామని, కానీ సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు అంబేద్కర్ ఆలోచనలతో కొత్త జ్యోతిని వెలిగించారని కొనియాడారు. ‘సమానత్వం, సంపద పంపిణీలాంటి అంశాలపై అంబేద్కర్ ఆలోచనలను తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేసి చూపిస్తున్నారు. కేసీఆర్ అంబేద్కర్ వాది’ అని కొనియాడారు.
రెండో రాజధానికి డిమాండ్ చేయండి
హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేయాలని ప్రకాశ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రానంతరం రాజధాని ఏర్పాటు సందర్భంలో ఢిల్లీని రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనను అంబేద్కర్ వ్యతిరేకించారని తెలిపారు. పాక్, చైనా సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉన్న హైదరాబాద్ను రాజధానిగా చేయాలని అంబేద్కర్ కోరారని గుర్తుచేశారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం రెండో రాజధానిగా హైదరాబాద్ కోసం డిమాండ్ చేయాలని సూచించారు. హైదరాబాద్ ఎంతో సురక్షితమైన ప్రాంతమే కాకుండా, దక్షిణ భారత రాష్ర్టాలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
హైదరాబాద్లో వెలిగిన జ్ఞానజ్యోతి
గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్, టెక్నాలజీ ఎండీ ఢిల్లీ వసంత్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణతో హైదరాబాద్ నగరంలో జ్ఞానజ్యోతి వెలిగినట్టు అయిందని గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ వసంత్ పేర్కొన్నారు. అంబేదర్ పేరున ఏటా అవార్డులు ఇస్తామని, రూ.51 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేశారు. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు కేంద్రంగా తెలంగాణను నిలిపిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.