KCR | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశ స్వాతంత్య్ర సాధన కోసం సాగిన మలి దశ పోరాటాన్ని శాంతియుతంగా నడిపి, గమ్యాన్ని చేరుకున్న జాతిపిత మహాత్మాగాంధీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ సాధన కోసం తాను సాగించిన మలిదశ పోరాటంలో ఇమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన కృషిని, త్యాగాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.
బాధితులకే సహనం ఎకువగా ఉండాలని, శాంతియుత మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే, తమకు జరుగుతు న్న అన్యాయాన్ని ఎదిరించి విజయం సాధించేందుకు మార్గం సుగమం అవుతుందనే గాంధీజీ కార్యాచరణ తన తెలంగాణ ఉద్యమ పంథాను ముందుకు నడిపించిందని తెలిపారు. భారత ప్రజలు మెచ్చేలా శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనతికాలంలోనే దేశం గర్వించే దిశగా అభివృద్ధి పథంలో నిలిపిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వెనుక గాంధీజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని వివరించారు.