హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. దాశరథి శత జయంతి సందర్భంగా మంగళవారం (జూలై 22)న ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు.
కవిగా, రచయితగా, తెలంగాణ ఆస్మితను, తన ప్రాంత ప్రజల కష్టాలను ప్రపంచానికి వినిపించిన, చాటి చెప్పిన తెలంగాణ గర్వించదగ్గ భూమి పుత్రుడు దాశరథి అని కేసీఆర్ పేర్కొన్నారు. అన్నార్తులు, పీడితులు, దుఃఖితుల కోసం తన కలాన్ని కదిలించిన దాశరథి కృషిని రేపటి తరాలు గుర్తు చేసుకునేలా, వారి పేరు మీద అవార్డు నెలకొల్పి, ప్రతి ఏటా వారి జయంతి రోజున లబ్ధ ప్రతిష్ఠులైన సాహిత్యకారులకు అందించాలని, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసిందని పేర్కొన్నారు. జైలు గోడల నడుమ నిర్భంధంలోనూ తెలంగాణ నినాదాన్ని వినిపించిన దాశరథి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే వారికి మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ తెలిపారు.