హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. కేసీఆర్ ట్వీట్చేసిన 24 గంటల్లోపే వర్సిటీ హాస్టళ్లు తెరిచే ఉంచుతామని ప్రకటించింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వేసవి సెలవులను ఉపయోగించుకుంటామని, హాస్టళ్లను మూసివేయ వద్దని ఇటీవల విద్యార్థుల బృందం నుంచి తమకు విజ్ఞాపన వచ్చిందని, వారి వినతి మేరకు వేసవి సెలవుల సమయంలోనూ హాస్టళ్లను తెరిచి ఉంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రిజిస్ట్రార్ తన ఉత్తర్వులో వెల్లడించారు.
మరి.. ఇదే నిజమైతే, కొన్నిరోజుల కిందట విద్యార్థుల బృందం విజ్ఞప్తి చేస్తే చీఫ్ వార్డెన్ నోటీసు జారీ చేసే ముందు దానిని ఎందుకు పరిశీలించలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారనేది ఇప్పటికిప్పుడు చోటుచేసుకున్న పరిణామమేమీ కాదు.
అంటే కేసీఆర్ దెబ్బకు సర్కారు దిగొచ్చింది.. అని పలువురు విద్యార్థులు తెలిపారు. వేసవి సెలవుల్లోనూ వర్సిటీ హాస్టళ్లను తెరిచే ఉంచుతామని ప్రకటించిన రిజిస్ట్రార్ మెస్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. దీనిపై చీఫ్ వార్డెన్ను సంప్రదించగా.. సెలవుల్లో హాస్టళ్లలో ఉండే విద్యార్థుల సంఖ్య ఆధారంగా మెస్లను ప్రారంభిస్తామని తెలిపారు.