‘దళితుల పట్ల సమాజ దృక్పథం మారాలి. ముఖ్యంగా పోలీసుల ఆలోచనాధోరణి మారాలి. దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. శాంతిభద్రతలను కాపాడటంలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. వీటిని క్షమించం. ఈ లాకప్డెత్కు కారణమైన వారిపై విచారణ జరిపి, చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవడంలో జాప్యం చేయవద్దు. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలి’
–సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరపాలని, నిజనిర్ధారణ చేసి, చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డిని శుక్రవారం ఆదేశించారు. తప్పని తేలితే ఆ పోలీసులను ఉద్యోగంలో నుంచి తొలగించాలని చెప్పారు. దళితులపై చేయిపడితే ప్రభుత్వం ఊరుకోబోదని, తక్షణమే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకానికి చెందిన మరియమ్మ లాకప్డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టంచేశారు. ‘దళితుల పట్ల సమాజ దృక్పథం మారాలి. ముఖ్యంగా పోలీసుల ఆలోచనాధోరణి మారాలి. దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
శాంతిభద్రతలను కాపాడటంలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. వీటిని క్షమిం చం. ఈ లాకప్డెత్కు కారణమైన వారిపై విచారణ జరిపి, చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవడంలో జాప్యం చేయవద్దు. అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలి’ అని ఆదేశించారు. 28న స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమారతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్రావు, కలెక్టర్, ఎస్పీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని సీఎం సూచించారు. చింతకానికి వెళ్లి లాకప్డెత్ సంఘటన పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు.
లాకప్డెత్ ఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కూతుళ్లను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. కుమారుడు ఉదయ్కిరణ్కు ప్రభుత్వ ఉద్యో గం, నివాస గృహంతోపాటు, రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలని, ఇద్దరు కూతుళ్లకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థికసహాయంగా అందచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరు లు పాల్గొన్నారు. అంతకుముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎస్సీసెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి మరియమ్మ లాకప్డెత్కు కారకులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఖమ్మంజిల్లా చింతకాని మండలం కోమటిగూడేనికి చెందిన మరియమ్మ.. యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలో ఓ ఇం ట్లో వంటమనిషిగా పనిచేశారు. ఆ ఇంట్లో దొంగతనం జరగడంతో అడ్డగూడూరు, చింతకాని పోలీసులు మరియమ్మను, ఆమె కొడుకు ఉదయ్కిరణ్ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని భట్టి విక్రమార్క వినతిపత్రంలో పేర్కొన్నారు. దెబ్బలను తట్టుకోలేక మరియమ్మ మృతిచెందినట్టు తెలిపారు.