ఆదిలాబాద్ : గర్భిణిల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూట్రిషన్ కిట్లు గర్భిణులకు వరం లాంటిదని పేర్కొన్నారు.
బిడ్డ సంరక్షణ కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం, తల్లి సంరక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు.రాష్ట్రంలో అత్యధికంగా రక్త హీనత నమోద వుతున్న తొమ్మిది జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఒకటని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.