హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని, ఆయన నాయకత్వం దేశానికి చాలా అవసరమని ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ (ఐపీసీ) పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం మారెప్ప పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఏపీతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో బీఆర్ఎస్కు మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. కేసీఆర్ ఎంతో జ్ఞానవంతుడని, ప్రజలకు మేలు చేయాలన్న పట్టుదల, తపన ఆయనలో మెండుగా ఉన్నాయని ‘నమస్తే తెలంగాణ’తో అన్నారు.
అలుపెరుగని ఉద్యమంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కేసీఆర్ తెలంగాణలో సీమాంధ్రులకు, వారి ఆస్తులకు, వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంతో మేలు జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో దళితులకు, గిరిజనులకు రూ.10 లక్షలు చొప్పున ఇవ్వడం మామూలు విషయం కాదని తెలిపారు.
రైతులకు ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇవ్వడంతోపాటు చనిపోయిన రైతుల కుటుంబాలకు రైతు బీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. స్వల్పకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగానికి పుష్కలంగా సాగునీటిని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రధాని అయితే విద్య, వైద్యం, రైతుల సంక్షేమంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశం దిశను మార్చగలరని మారెప్ప అభిప్రాయపడ్డారు.
విఫల ప్రధాని మోదీ
ప్రధానిగా మోదీ విఫలమయ్యారని మారెప్ప పేర్కొన్నారు. స్విస్ బ్యాంకులో భారతీయులు అక్రమంగా దాచిపెట్టిన లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన బడా ఆర్థిక నేరగాళ్లకు మోదీ సంపూర్ణంగా సహకరించారని ధ్వజమెత్తారు.
కేవలం అదానీ, అంబానీ లాంటి బడాబాబుల కోసమే పాటుపడుతున్న మోదీ.. దేశంలోని పేదల సంక్షేమం, వారి ఆర్థికాభ్యున్నతి గురించి ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్లాంటి రాజ్యంగబద్ధ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్న మోదీ.. రూ.80 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని రుణాల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. జీఎస్టీతో ధరలను పెంచి కోట్ల మంది సామాన్యుల జీవితాలను చిదిమేసిన మోదీ గద్దె దిగాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన మరోసారి అధికారంలోకి వస్తే దేశం అధోగతి పాలవడం ఖాయమని మారెప్ప ఆందోళన వ్యక్తం చేశారు.