హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : కుల, వర్ణ, లింగ వివక్షను వ్యతిరేకించిన సామాజిక అభ్యుదయ వాది, వీరశైవ లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు, బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం బసవన్న జయంతి సందర్భంగా ఆయన చేసిన సామాజిక కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ధార్మిక ప్రవచనాలు, వచన సాహిత్యం, కార్యాచరణ ద్వారా సమానత్వం కోసం పాటుపడిన సామాజిక విప్లవకారుడు బసవన్న అని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన దార్శనిక పాలకుడిగా ప్రజల మన్ననలు అందుకున్నాడని తెలిపారు. బసవేశ్వరుడి ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.