నాగర్కర్నూల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ కిట్. దీనిని మాతాశిశు మరణాలను అరికట్టేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన బృహత్తర పథకం. ఈ పథకం ద్వారా.. జన్మనిచ్చిన తల్లికి, పుట్టిన శిశువుకు ఆర్థిక సహాయంతోపాటు 13 రకాల వస్తువులు అందేవి. అలాంటి కిట్ల సరఫరా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయింది.
అంతేకాదు.. ఈ పథకం పేరు మదర్, చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్)గా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. పేరు మార్పు సరేకానీ.. కిట్ల సరఫరా ఎప్పుడోనని వేలాది మంది బాలింతలు ఎదురుచూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మాతాశిశు మరణాలను అరికట్టడంపైనా ప్రభావం చూపడంతోపాటు సర్కారు దవాఖాన్లలో కాన్పులు జరగాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉన్నది.
ఎంసీహెచ్ కిట్ల సరఫరా ఎప్పుడో?
ఎంసీహెచ్ (మదర్, చైల్డ్ హెల్త్) కిట్ల సరఫరాపై ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2017, జూలై 20న ఈ పథకం ప్రారంభమైంది. ప్రభుత్వం ఈ పకథకం కింద.. సర్కారు దవాఖాన్లలో కాన్పులు చేయించుకున్న వారికి మగ శిశువు పుడితే రూ. 12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు అం దించేది. మాతాశిశువుకు ఉపయోగపడే బేబి నూనె, బేబీ పౌడర్, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్బ్యాగ్, టవల్, న్యాప్కిన్లు, షాంపూ, బొమ్మల్లాం టి పలు రకాల వస్తువులను ఇచ్చేది.
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం చేకూరింది. ఈ ప్రోత్సా హం వల్ల కుటుంబీకులు కూడా గర్భిణులను ప్రభుత్వ దవాఖాన్లలో చేర్పించి అక్కడే కాన్పు లు చేయిస్తున్నారు. దీంతో మాతాశిశు మరణా లు చాలా వరకు తగ్గాయి. దీనికి ఎంసీహెచ్ పథకమే కారణం. అలాంటి ఈ కిట్ల పంపిణీ రెండు నెలలుగా నిలిచిపోయింది.
అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేరు మార్పుపై చూ పిన శ్రద్ధ కిట్ల పంపిణీపై చూపించడం లేదనే విమర్శలున్నాయి. ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి కిట్ల ఆవశ్యకతపై నివేదికలు పంపించారు. వేలాది మంది మహిళలు ఈ కిట్ల కోసం ఎదురు చూస్తున్నారని, కాన్పుల తర్వాత కిట్లను అడిగితే దవాఖాన్లలో డాక్టర్లు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. రెండు నెలల కిందటి వరకు దవాఖాన్లలో కాన్పులు అయిన వెంటనే కేసీఆర్ కిట్లను అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు.
వెయ్యి కిట్లు అవసరం
నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో కాన్పుల సంఖ్య అధికంగా ఉంది. రోజూ 20 వరకు ప్రసవాలు జరుగుతుండటంతో ఆయా జిల్లాల దవాఖానల అధికారులు కిట్ల పంపిణీపై సమాధానం చెప్పలేకపోతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో రోజూ 20 నుంచి 30 కాన్పులు జరుగుతుండగా 20 వరకు మాత్రమే కిట్లు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇక జిల్లాలోని 20 మండలాల పరిధిలో 28 పీహెచ్సీలు ఉన్నాయి.
ఇప్పటివరకు జిల్లాలో కేవలం 500 కిట్లు మాత్రమే ఉండగా.. బిజినేపల్లి, బొప్పల్లి, కోడేరు, వంగూరు, వెల్దండ, వెన్నచర్ల వంటి 10 దవాఖాన్లలో ఒక్క కిట్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. కాన్పుల కోసం పలు దవాఖాన్లలో 24 గంటల వైద్య సేవలు అందిస్తున్నారు. కిట్ల సరఫరా ఆగిపోవడంతో ఆయా దవాఖాన్లలో కాన్పులపై ప్రభావం పడే అవకాశం ఉంది. తద్వారా మాతాశిశు మరణాలను అరికట్టాలన్న సదుద్దేశం నీరుగారిపోనున్నది. కేసీఆర్ కిట్ పథకం పేరు మార్చిన ప్రభుత్వం.. కిట్ల పంపిణీపై కూడా అదే స్థాయిలో చర్యలు చేపట్టాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం వెయ్యి కిట్లు అవసరం కాగా.. 500 కిట్లు మాత్రమే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ వైద్యంపై ఇప్పటి వరకు ప్రజలకు ఏర్పడిన నమ్మకం సడలిపోనున్నది.
ఈ నెలలో కిట్లు వస్తాయి
ఎంసీహెచ్ కిట్ల సరఫరాపై రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖకు నివేదించాం. సర్కారు దవాఖాన్లలో జరుగుతున్న కాన్పులను బట్టి అందుబాటులో ఉన్న కిట్లను పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 500 వరకు ఎంసీహెచ్ కిట్లు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో కిట్ల వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వెంటనే కాన్పులు చేయించుకున్న మహిళలందరికీ ఈ కిట్లను అందిస్తాం.
-సుధాకర్లాల్, డీఎంహెచ్వో నాగర్కర్నూల్