గెల్లు ఎంపికపై మంత్రి తలసాని హర్షం
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్ను ప్రకటించటం పట్ల సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థి, యువజన, ఉద్యమ నేతల ఎదుగుదలకు సీఎం కేసీఆర్ అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు. నాగార్జునసాగర్లో యువకుడు నోముల భగత్ను గెలిపించినట్టే, హూజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తామన్నారు. సీఎం కేసీఆర్ కురుమ, యాదవ కులానికి అనేక అవకాశాలు కల్పించారని, ఐదుగురికి ఎమ్మెల్యేలుగా, ఒకరికి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారని గుర్తుచేశారు. గొల్లకురుమ, యాదవ కులాలు సీఎం కేసీఆర్కు జన్మతః రుణపడి ఉంటాయని చెప్పారు.
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
దళితబంధు పథకాన్ని ప్రకటించగానే విపక్షాల నేతలు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తంచేశారు. జైలుకెళ్లిన వారే జైలుకు పంపిస్తామని మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అన్నారు. దద్దమ్మలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హుజూరాబాద్లో బీజేపీ రాజేందర్ గెలిస్తే ఆ పార్టీకి మూడో ఎమ్మెల్యే మాత్రమే అవుతాడని, గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నియోజకర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబుయాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకర్గ ఇంచార్జి తలసాని సాయికిరణ్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, కిషోర్గౌడ్, యాదవసంఘాల ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
యాదవుల పక్షపాతి కేసీఆర్
అఖిల భారత యాదవ మహాసభ ప్రకటన
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): యాదవులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యం కల్పిస్తూ వారి అభివృద్ధికి చేయూతనిస్తున్న సీఎం కేసీఆర్ యాదవుల పక్షపాతి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రకటించింది. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్కు అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తంచేసింది. ఈ మేరకు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావు యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రవీందర్యాదవ్, ఉపాధ్యక్షుడు బాల మల్లేశ్యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బీ శ్రీనివాస్యాదవ్, పీ శ్రీహరియాదవ్, జీ రాజారామ్యాదవ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఏ రమేశ్యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాగం సుజాతయాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం మహేందర్యాదవ్, గోవర్ధన్ యాదవ్, యశ్వంత్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్యాదవ్కు అవకాశం కల్పించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్లోని అన్ని సంఘాలను కలుపుకొని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రకటించారు.