బెంగళూరు, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో తనకు అభిప్రాయ బేధాలు వచ్చాయనటం దుష్ప్రచారం మాత్రమేనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) అధినేత కుమారస్వామి కొట్టిపారేశారు. రాయచూర్లో మంగళవారం నిర్వహించిన పంచరత్న యాత్రలో కుమారస్వామి పాల్గొన్నారు. ఆయన వెంట నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం లభిస్తే కేసీఆర్ స్ఫూర్తితో కర్ణాటకను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తనకూ, కేసీఆర్కు మధ్య విభేదాలు తలెత్తాయనటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఆయనతో కలలో కూడా విభేదాలు తలెత్తవని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తండ్రి దేవేగౌడ తర్వాత తనకు అంతటి మార్గదర్శి కేసీఆరేనని స్పష్టంచేశారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని, మిషన్ భగీరథ పథకం వల్ల ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదని తెలిపారు.
సాగు, తాగు నీటి పథకాలను విజయవంతంగా అమలు చేయటంలో కేసీఆర్ అంకిత భావం, దృఢ సంకల్పం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరం స్ఫూర్తితో ఐదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో కర్ణాటక తిరోగమనంలోకి మళ్లిందని విమర్శించారు. తిరిగి కర్ణాటకను ప్రగతి బాట పట్టించేందుకు కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు మార్గదర్శకాలు అని స్పష్టంచేశారు.